Mahesh Goud: పాకిస్థాన్తో యుద్ధంపై వెనక్కు తగ్గారు
ABN , Publish Date - May 30 , 2025 | 06:39 PM
సైనికులకు బాసటగా రాహుల్గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్పాయ్ కొనియాడిన విషయం కిషన్రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) సరైన రీతిలో యుద్ధం చేయలేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రలోభానికి గురై వెనకడుగు వేశారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్పై భారతదేశం చేసిన యుద్ధం తీరు తెన్నుల గురించి తెలియాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన యుద్ధం..మోదీ హయాంలో జరిగిన యుద్ధాన్ని పోలుస్తూ ఇందిరాగాంధీ హయాంలోని 90 వేల మంది సైనికులు ముక్కుకు నెలకి రాశారని షాకింగ్ కామెంట్స్ చేశారు మహేష్ కుమార్ గౌడ్.
బీజేపీ నేతలకు వార్నింగ్...
ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ చేశారు. బీజేపీ నేతలు రాహుల్గాంధీపై అవాకులు చెవాకులు పెళుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. సైనికులకు బాసటగా రాహుల్గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. భారతదేశ ప్రజలు అడుగుతున్నారు.. పాకిస్థాన్పై యుద్ధంలో సాధించింది ఏమిటి.. కోల్పోయింది ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. అపర ఖాళీ మాత ఇందిరాగాంధీ అని వాజ్పాయ్ కొనియాడిన విషయం కేంద్రమంత్రి కిషన్రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇందిరా గాంధీ హయాంలో వందల సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని గుర్తుచేశారు. సైనిక రహస్యాలను రాజకీయ స్వార్థం కోసం బీజేపీ వాడుకొని లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు మహేష్ కుమార్ గౌడ్.
బీఆర్ఎస్ మునిగిపోయిన నావ..
బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని.. ఆ నావలో ఉన్న వస్తువులు(డబ్బుల) కోసం మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో కొట్లాట జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. తెలంగాణలో ఎనిమిది సీట్లు ఉన్న బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలకు పరిమితమవుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పే దమ్ము కిషన్రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు ముందుగా వారి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్.
వాటాల కోసం పంచాయితీ...
కవిత, రాజాసింగ్ వ్యాఖ్యలను పోల్చి చూస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో వాటాల కోసం పంచాయితీ మొదలైందని అన్నారు. నోటీసులు రాగానే కేసీఆర్, ఈటల రాజేందర్కి పాత బంధం మళ్లీ చిగురుచ్చిందని ఎద్దేవా చేశారు. కులసర్వే బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఉద్ఘాటించారు. కాళేశ్వరం విషయంలో నోటీసులు రాగానే ...శామీర్పేటలోని ఓ ఫాంహౌస్లో మాజీ మంత్రి హరీష్రావుతో ఈటల రాజేందర్ సమావేశం అయ్యారని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం
హరీష్రావుతో కలిసి ఈటల కేసీఆర్తో ఫోన్లో సంభాషించారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కవిత లెటర్ లీక్ వెనక ఆమె ప్రమేయం లేదా కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండవచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్, కవిత వ్యాఖ్యలతో ముడుపులు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం గుట్టు వీడిందని చెప్పుకొచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి గురించి కవిత చెప్పకనే చెబుతున్నారని అన్నారు. కేసీఆర్, కిషన్రెడ్డి కలవడం వల్లే బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పరోక్షంగా చెబుతున్నారని అన్నారు. రాజాసింగ్ లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం బీజేపీ నేతల చేతగానితనమని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కరీంనగర్ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్గా పనిచేశా.. అయినప్పటికీ
Read Latest Telangana News And Telugu News