Kunamneni: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:26 AM
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.

హనుమకొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఎపిసోడ్ ఇప్పుడు రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. బీజేపీతో బీఆర్ఎస్ కలవబోతుందనే కవిత ప్రకటనపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత ప్రకటనతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల స్థితిగతులు ఎలా ఉన్నాయో..తెలంగాణలో కవిత పరిస్థితి కూడా అలాగే ఉందని ఆయన విమర్శించారు. ఇవాళ(శనివారం) హనుమకొండలో కూనంనేని సాంబశివరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు ఇప్పుడు నోరు మూసుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అన్నీ తానే అన్న కేసీఆర్ ఇప్పుడు తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్రావు అంటున్నారని చెప్పారు. గతంలో 140మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని తాము డిమాండ్ చేశామని గుర్తుచేశారు. కాళేశ్వరం నిర్మించాక ఒక చుక్కనీరు అదనంగా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పంటలకు వచ్చేవి ఎల్లంపల్లి నీళ్లేనని స్పష్టం చేశారు కూనంనేని సాంబశివరావు.
కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందని చెప్పారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. పేదలు లేని దేశంగా ఇండియాని చూపాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నెలకు రూ.8 వేల ఆదాయం ఉంటే ధనికులు ఎలా అవుతారని ప్రశ్నించారు. పేదలను మోదీ ప్రభుత్వం దగా చేస్తోందని ఫైర్ అయ్యారు. నెలకు రూ. 20వేల ఆదాయం ఉన్నా కూడా పేదవారిగానే పరిగణించాలని కూనంనేని సాంబశివరావు కోరారు.
ఇవి కూడా చదవండి
మరోసారి సిట్ ముందుకు ప్రణీత్ రావు
పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో
Read Latest Telangana News And Telugu News