KCR on Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్ నిలిపేయాల్సిందే.. మళ్లీ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేద్దాం
ABN , Publish Date - Jul 29 , 2025 | 09:58 PM
ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్లో మంగళవారం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై (Revanth Govt) పోరాడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పిలుపునిచ్చారు. గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్లో ఇవాళ(మంగళవారం, జులై 29) కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. రేవంత్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీలేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందేనని గులాబీ బాస్ ఆదేశించారు.
అందుకు బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్ర స్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర రైతాంగ సంక్షేమం కాపాడటం... వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ మీద ఎర్రవెల్లి నివాసంలో అధినేత కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు తన్నీరు హరీష్రావు, జి. జగదీశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ చేసిన కీలక సూచనలు..
తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గం.
కాంగ్రెస్ని నమ్మిన పాపానికి, తెలంగాణ రైతాంగానికి.. శాశ్వత అన్యాయం వడిగడుతున్న రేవంత్ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీల ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తహతహ లాడుతుండటాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఉద్దేశపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు అయిపోతున్నా కూడా ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలి.
కన్నేపల్లి పంప్హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలి. పంపులను ఆన్ చేయాలి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపాలి.
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం దీని మీద పోరాటాలు చేయాలి.
కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. ఈ విషయం మీద గట్టిగా గులాబీ శ్రేణులు రెండు పార్టీలను నిలదీయాలి.
ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్న దిశగా.. మిగతా అన్ని అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేసి వాళ్లను క్షేత్రస్థాయిలో పోరాటంలో ప్రజలతో మమేకం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News