KTR: కాళేశ్వరం కమిషన్ పేరిట నాటకాలాడుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:21 AM
కాళేశ్వరం కమిషన్ పేరిట రేవంత్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్కు వెంటనే రిపేర్లు చేసి నీళ్లివ్వాలని తాము గతంలో కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) కాంగ్రెస్, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీమంత్రి హరీష్రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రెజెంటేషన్ అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. తన విజ్ఞప్తి మేరకు హరీష్రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం చేశామని తెలిపారు. నీళ్ల విషయంలో దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ దందాలు.. చందాలేనని షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
కేసీఆర్పై అభాండాలు..
ఎన్డీఎల్సీ రిపోర్ట్ తప్పని.. బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాలు కట్టిన సంస్థ చెప్పిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. సుంకిశాల, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి ఎనిమిది మంది కార్మికులు చనిపోతే సీఎం రేవంత్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. కాళేశ్వరం విషయంలో మాత్రం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 371పిల్లర్లలో రెండు మాత్రమే కుంగాయని అన్నారు. తెలంగాణ నుంచి పంపిన మూటలతోనే ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కట్టారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ రెండు పిల్లర్లలో మాత్రమే పగుళ్లు వస్తే.. ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందన్నట్లుగా కాంగ్రెస్ నేతలు, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై కేసీఆర్పై అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ పేరిట రేవంత్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్కు వెంటనే రిపేర్లు చేసి నీళ్లివ్వాలని తాము గతంలో కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మాగంటి గోపీనాథ్ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్
అంతకుముందు.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మాగంటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మాగంటి గోపీనాథ్కి అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట దాసోజు శ్రవణ్, రవీందర్రావు, మాలోతు కవిత, రాగిడి లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాజన్న కోడెలపై రాజకీయం వద్దు: సురేఖ
రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన : డీకే అరుణ
Read Latest Telangana News And Telugu News