Srinivasa Varma: ఏపీకి అన్నివిధాలుగా మోదీ ప్రభుత్వం చేయూత: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:28 PM
టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సమూచిత స్థానాన్ని కలిపిస్తోందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఏర్పాటులో భాగంగా ఏపీలో ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

విజయవాడ: ఏపీకి అన్నివిధాలుగా మోదీ ప్రభుత్వం (Modi Government) చేయూత అందిస్తోందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Union Minister Bhupathi Raju Srinivasa Varma) వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వంలో మోదీ ప్రభుత్వం ఏపీకి ఎలాంటి సహాయం చేయట్లేదని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి 11సంవత్సరాలు అయ్యిందని అన్నారు. 2047 నాటికీ వికసిత్ భారత్, విశ్వ గురు దేశంగా భారతదేశం ఆవిర్భవించాలని ఆకాంక్షించారు.
ఇవాళ(బుధవారం) విజయవాడలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడారు. ఈ 11సంవత్సరాల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని వివరించారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకునే నాటికీ దేశం 11వ ఆర్థిక వ్యవస్థలో ఉండేదని వెల్లడించారు. ఈ 11 సంవత్సరాల్లో మోదీ నాయకత్వంలో దేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని.. రాబోయే కాలంలో మూడోస్థానానికి వెళ్లబోతుందని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కూదేలయ్యాయని అన్నారు. వాటన్నిటిని తట్టుకుని భారతదేశం ఆర్థిక వ్యవస్థగా మోదీ నాయకత్వంలో ఎదిగిందని తెలిపారు. చాలా సంక్షేమ పథకాలు అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా తీసుకెళ్లామని వివరించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
పేదలకి సంక్షేమ పథకాల కింద రూ.45లక్షల కోట్లని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గుర్తుచేశారు. గ్రామ, పట్టణ ప్రాంత పేదలకి లక్షలాది గృహాలు నిర్మించి ఇచ్చామన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా గ్రామ ప్రజలకి తాగునీటి సదుపాయం కల్పించామని చెప్పారు. ఉచితంగా కుళాయి పంపులు ఏర్పాటు చేశామని.. ఏపీలో విజయవంతంగా జరుగుతుందని అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మోదీ కృషి చేశారని ఉద్ఘాటించారు. కరోనా సమయంలో పేదలకి గరీబ్ అన్నా యోజన పథకం కింద ఉచితంగా రేషన్ పంపిణీ చేశారని తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద సంక్షేమ పథకం ... ఉచిత రేషన్ పంపిణీ అని ఉద్ఘాటించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
దేశంలో 50కోట్ల మందికి ముద్రరుణాలు ఇచ్చారని.. ఏపీలో 48 లక్షల మందికి ఈ ముద్ర రుణాలు మంజూరు చేశారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పేదలకి ఆరోగ్య భద్రతని కల్పించారని వివరించారు. 2014 నుంచి బీమా పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. గ్రామాల్లో లింక్ రోడ్ల నిర్మాణం, నేషనల్ హైవేలని నిర్మించారని చెప్పుకొచ్చారు. రైతులకి సంబంధించి కిసాన్ సమ్మాన్ యోజన కింద 11వేల కోట్ల మంది రైతులని ఆదుకున్నామని తెలిపారు. 2014-15లోనే మన రాష్ట్ర రాజధాని అమరావతికి రూ.2500 కోట్లను ప్రకటించారని గుర్తుచేశారు. రైల్వే లైన్లు కనెక్టివిటీ కోసం నిధులు కేటాయించారని వెల్లడించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
పోలవరం కోసం రూ.12వేల కోట్లు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో చాలా పరిశ్రమలకి తోడ్పాటు కలిపిస్తోందని అన్నారు. రామాయపట్నం బీపీసీల్లో ఉద్యోగ కల్పన రానుందని... ఇలా భారతదేశం ఈ 11సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెందిందని వివరించారు. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సమూచిత స్థానాన్ని కలిపిస్తోందని అన్నారు. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఏర్పాటులో భాగంగా ఏపీలో ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ కలకలం..
తిరుమల: దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..
For More AP News and Telugu News