KTR: కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jul 27 , 2025 | 02:44 PM
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించిందని.. ఈసారి జరిగే ఎన్నికల్లో సామాజిక న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

హనుమకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ని అత్యధికి మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) కోరారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించిందని.. ఈసారి జరిగే ఎన్నికల్లో సామాజిక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ని బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెట్ రైట్ అవుతుందని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మంచిగా పనిచేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు సమ్మక్క- సారక్క, రాణి రుద్రమ వారసులు అయిన వరంగల్ ఆడబిడ్డలు కర్రు కాల్చి వాత పెట్టాలని హెచ్చరించారు. మొన్న పార్లమెంటు ఎన్నికలప్పుడు రైతుబంధువేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్లీ రైతుబంధు వేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకుని మీ ఇంటికి వచ్చే బీఆర్ఎస్ కేడర్ను కేసీఆరే వచ్చారని భావించి కడుపులో పెట్టుకొని ఆశీర్వదించాలని కోరారు మాజీ మంత్రి కేటీఆర్.
ఆరు గ్యారెంటీలు ఎక్కడ..
రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. నూరు రోజులు...ఆరు గ్యారంటీలు ఎక్కడ అని కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి ప్రశ్నించాలని అన్నారు. ఇవాళ(ఆదివారం జులై 27) పరకాలలో లలితా కన్వెషన్ హాల్లో గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లని మాజీ మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలతో సీఎం రేవంత్రెడ్డి గారడీ చేశారని.. రూ.4 వేలు పెన్షన్ అన్నారని.. ఎక్కడ వచ్చాయి..? తులం బంగారం, రైతు బంధు రూ.15 వేలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఓట్ల సమయంలో రైతుబంధు వేస్తున్నారని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ అయ్యా జాగీరు కాదని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.ప్రభుత్వ అధికారులు ఆటలాడుతున్నారని విమర్శించారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్కు దోచుకోవడమే పని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి రిజర్వేషన్ డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
బీసీలకు కేసీఆర్ న్యాయం చేశారు...
‘నిన్నైనా, రేపైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరే. కాకతీయ టెక్స్టైల్ పార్క్లో కాంగ్రెస్ విచ్చలవిడిగా దోపిడికి పాల్పడింది. కాంగ్రెస్ నేతల గుండాయిజంతో పరిశ్రమలు పారిపోయే ప్రమాదం ఉంది. గతంలో బీసీలకు న్యాయం చేశాం, రేపు కూడా బహుజనులకు సరైన ప్రాధాన్యత ఇచ్చేది కేసీఆర్ మాత్రమే. దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్టైల్ పార్క్లో 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. మేము చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ గుండాయిజంతో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి దాపురించింది. కాకతీయ టెక్స్టైల్ పార్కులో కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన రూ.137 కోట్ల అంచనాలని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో రూ.297 కోట్లకు పెరిగాయి. కాలువ నిర్మాణం పేరుతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు రూ.167 కోట్లు దోచుకోవాలనుకున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు పరిశ్రమలను తెప్పించి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అనుకుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని నిలువు దోపిడీ చేసే కుట్రలు చేస్తున్నారు. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తాం’ అని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
ఆడబిడ్డలకు రూ. 50 వేలు బాకీ..
‘తెలంగాణలోని ప్రతీ ఆడబిడ్డలకు రేవంత్ ప్రభుత్వం రూ. 50 వేలు బాకీ ఉంది. చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్లుగా స్వయం సహాయక బృందాలకు రూ.3000 కోట్ల ఇవ్వాల్సిన రేవంత్ ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు ఇచ్చి సంబరాలు చేసుకోమంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరిలోనే ఎరువులు కొని బఫర్ స్టాక్ చేశాం. అందుకే కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు యూరియా దుకాణాల ముందు లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు కనిపించలేదు. టైంకి యూరియా, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పదవిలో ఉండే అర్హత లేదు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్రెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నాడు. పరకాల నియోజకవర్గంలో ఇళ్లు నిర్మించుకున్న 3 వేల మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సతాయిస్తోంది. లబ్ధిదారుల తరపున పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోర్టుకు పోతే, న్యాయస్థానం చెప్పినా కూడా రేవంత్ ప్రభుత్వం స్పందించడం లేదు. 3000 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగేదాకా పోరాడుదాం, అసెంబ్లీలో కొట్లాడుతాం’ అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఆజం జాహీ మిల్లు మూతపడింది..
‘తెలంగాణ షాన్గా ఉన్న ఆజం జాహీ మిల్లు సమైక్య పాలనలో మూతపడింది. నాటి సమైక్య పాలకులు ఆజం జాహి మిల్లు భూములను అడ్డుకి పావు సేరులాగా అమ్ముకున్నారు. ఆజం జాహి మిల్లు మూతపడటంతో వరంగల్ జిల్లాలోని పద్మశాలీలు బతుకుదెరువు కోసం భీమండి, సూరత్, షోలాపూర్, వలస పోయారు. అలా వలస పోయిన వాళ్లందరినీ స్వరాష్ట్రంలో తిరిగి వెనక్కి తెప్పించుకుంటామని ఉద్యమ కాలంలో కేసీఆర్ చెప్పారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ వచ్చాక ఇదే వరంగల్ గడ్డపై 1500 ఎకరాల్లో భారతదేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ది, పట్టుదల, నిజాయితీ కారణంగా కేరళకు చెందిన కీటెక్స్ సంస్థ రూ.2400 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. దాంతో పాటు యంగ్ వన్ అనే కొరియా సంస్థ, గణేష్ ఏకో అనే బొంబాయి సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడంతో 2022- 23 నాటికి టెక్స్టైల్ పార్క్లో ఒక యూనిట్ను ప్రారంభించాం. శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలకు కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. శ్రామికులుగా సూరత్కు వలస పోయిన కార్మికులను తిరిగి పారిశ్రామికులుగా తెలంగాణకు రప్పించేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మడికొండలో 100 ఎకరాల్లో ఏర్పాటుచేసిన షెడ్లు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో నిరుపయోగంగా మారాయి’ అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ
వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..
Read latest Telangana News And Telugu News