Kunamneni Sambasiva Rao: తెలంగాణను కేసీఆర్ అప్పులమయంగా మార్చారు: కూనంనేని
ABN , Publish Date - Jun 13 , 2025 | 11:50 AM
ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.

సిద్దిపేట జిల్లా: సంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) కట్టి అప్పుల రాష్ట్రంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మార్చారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (CPI MLA Kunamneni Sambasiva Rao) ఆరోపించారు. తెలంగాణలో కాళేశ్వరంపై విచారణ జరుగుతోందని అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇంజనీర్స్దే పాత్ర ఉందని తమకు ఏం తెలియదని అనడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చలేక కుంగిపోతోందని విమర్శించారు కూనంనేని సాంబశివరావు.
సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువారెడ్డి ఇవాళ(శుక్రవారం) 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా చాలా అంశాలపై చర్చ జరుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రజలకు హామీలు నెరవేరుస్తామని పార్టీలు మభ్య పెట్టవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా, రుణమాఫీ పూర్తిగా ఇచ్చినట్లు చెబుతూ చేతులు ఎత్తేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్ట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు కూనంనేని సాంబశివరావు.
బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని కూనంనేని సాంబశివరావు కోరారు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేంద్రం ప్రభుత్వం పెయిల్ అయిందని విమర్శించారు. మాజీ సీఎం ఈ ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమని అన్నారు. ఆర్థికంగా జర్మనీని దాటినట్లు చెబుతూ కేంద్రం అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతోందని ధ్వజమెత్తారు. అనేక మంది చాలీచాలని జీతాలతో అర్ధాకలితో చాలామంది ఉన్నారని చెప్పారు కూనంనేని సాంబశివరావు.
విద్య, వైద్యపరంగా మనం 126వ స్థానంలో ఉన్నామని కూనంనేని సాంబశివరావు వివరించారు. ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని ఉద్ఘాటించారు. డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాలను 5లక్షల మందితో నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
త్వరలో కాళేశ్వరంపై సర్కారుకు నివేదిక
గుట్ట ప్రధాన కూడళ్లలో దేవుళ్ల విగ్రహాలు
Read latest Telangana News And Telugu News