Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద సరస్వతి పుష్కరాలపై లేదా.. రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశ్నల వర్షం
ABN , Publish Date - May 19 , 2025 | 04:31 PM
Bandi Sanjay: సరస్వతి పుష్కరాలను కేవలం ఒక ఏరియాకే మాత్రమే పరిమితం చేయడం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ పుష్కరాలను సరిగా నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ సరస్వతి పుష్కరాల (Saraswati Pushkaralu) నిర్వహణపై లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రూ.35కోట్లు మాత్రమే కేటాయించారని, ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. ఉత్తర్ప్రదేశ్లో మహాకుంభమేళా సందర్భంగా 50 కోట్ల మంది భక్తులకు తమ ప్రభుత్వం అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిందని, కాళేశ్వరం పుష్కరాలకు విచ్చేసే 50 లక్షల మందికి రేవంత్ ప్రభుత్వం సరైన ఆతిథ్యం ఇవ్వలేకపోతోందని అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాల నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం విఫలమవుతోందని బండి సంజయ్ విమర్శలు చేశారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే దక్షిణాది మొత్తానికి సరస్వతి పుష్కరాలను పండుగగా నిర్వహించే వాళ్లమని చెప్పుకొచ్చారు బండి సంజయ్. అందాల పోటీలను నిర్వహించడానికి అభ్యంతరం లేదని... కానీ ఆధ్యాత్మిక పుష్కరాలను పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. సరస్వతి పుష్కరాలు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ఇంత పెద్దఎత్తున జరుగుతున్న పుష్కర పండగకు ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 35 కోట్లు ఎలా సరిపోతాయని నిలదీశారు. అందాల పోటీలకు రూ.300 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఆధ్యాత్మికతకు రూ. 35 కోట్లు వెచ్చించడమెంటని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ తన సతీమణి అపర్ణతో కలిసి ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం కాళేశ్వరం విచ్చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పోలీస్ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కేంద్రమంత్రి దంపతులు పుష్కర స్నానాన్ని ఆచరించారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. బండి సంజయ్ దంపతులకు పూజారులు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. అంతకుముందు పుష్కరఘాట్ వద్ద, ఆ తర్వాత కాళేశ్వరస్వామి ఆలయం వద్ద మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కర స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
చాలా సంతోషంగా ఉంది..
‘సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం విచ్చేసి పుష్కర స్నానం ఆచరించడం చాలా సంతోషంగా ఉంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం ఇది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు హాజరై స్నానమాచరించడం ఆనందంగా ఉంది. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశానికి మరింతగా సేవలు అందించేలా దీవించాలని ఆ స్వామివారిని ప్రార్థించా’ అని బండి సంజయ్ తెలిపారు.
కాళేశ్వరం చాలా శక్తివంతమైన ప్రాంతం...
‘ఏమైనా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తారు. అన్నీ కేంద్రమే చేస్తే ఇక రాష్ట్రం ప్రభుత్వం ఎందుకు. కేవలం ఒక ఏరియాకే పుష్కరాలను పరిమితం చేయడం సరికాదు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులందరి కోరికలు తీర్చాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా. కాళేశ్వరం చాలా శక్తివంతమైన ప్రాంతం. గత కేసీఆర్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మనకు చాలా చెడ్డ పేరు వచ్చింది. అలాగే గత ప్రభుత్వం కాళేశ్వరం ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తానని మొండిచేయి చూపింది. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కూడా రూ. 200 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. గతంలో వేములవాడకూ ఇలానే హామీ ఇచ్చారు. కానీ ఎన్ని నిధులిచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా వట్టి హామీలను పక్కనపెట్టి కాళేశ్వరాన్ని అద్బుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్సిటీ ఫైర్ యాక్సిడెంట్కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News