Share News

RS Praveen Kumar: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో రేవంత్‌రెడ్డి స్కామ్ చేస్తున్నారు

ABN , Publish Date - May 31 , 2025 | 04:08 PM

రేవంత్ ప్రభుత్వం ఎస్సీ గురుకులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ రోజు డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

 RS Praveen Kumar: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో రేవంత్‌రెడ్డి స్కామ్ చేస్తున్నారు
RS Praveen Kumar

హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్కామ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం తన అనుచరులకు ఇచ్చే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు అధో:పాతాళానికి వెళ్తున్నాయని ఆక్షేపించారు. చాలామంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గాల పట్ల ఐఏఎస్ అలుగు వర్షిని వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అందరికంటే పెద్ద మాదిగ,పెద్ద మాల తానే అని రేవంత్ రెడ్డి అంటారని.. కానీ పేద పిల్లలు టాయిలెట్స్ వాళ్లే కడుక్కోవాలని ఐఏఎస్ అధికారితో ఎలా చెప్పిస్తారని ప్రశ్నించారు. ఎస్సీలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని మాజీ సీఎం కేసీఆర్ గురుకులాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.


ఎస్సీ గురుకులాల పట్ల వివక్ష...

రేవంత్ ప్రభుత్వం ఎస్సీ గురుకులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట్లాడలేని అధికారులను సాంఘిక సంక్షేమ శాఖలో ఎందుకు నియమించారని ప్రశ్నించారు. గురుకుల విద్యార్థిని ఆగసార నందినికి గోల్డ్ మెడల్ వస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నగదు ప్రోత్సాహం ఇవ్వరని నిలదీశారు. గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాల సిబ్బందిని తొలగిస్తున్నారని చెప్పుకొచ్చారు. గౌలిదొడ్డిలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను బయటకు పంపాలని ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేతలం గురుకుల బాట చేపడితే తమను లోపలికి రానివ్వలేదని మండిపడ్డారు. ఇదేనా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని చెబుతున్న రాజ్యాంగ నీతి అని ప్రశ్నించారు. సంపన్న వర్గాల పిల్లలకు ఒక రూల్ పేద పిల్లలకు ఒక రూలా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.


డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు..

ఎస్సీలకు బాయ్స్, గర్ల్స్‌కు ఒకే చోట తరగతులు ఉండకూడదని ప్రభుత్వం అంటోందని.. అమ్మాయిలకు భువనగిరిలో సైనిక స్కూల్ ఏర్పాటు చేస్తే దాన్ని ఎందుకు మూసివేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ రోజు డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా కాలేదని అన్నారు. గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు మూతపడే విధంగా రేవంత్ రెడ్డి, అలుగు వర్షిని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురుకుల భవనాలు కట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం ఇచ్చిందని గుర్తుచేశారు. గురుకుల ఇంటర్ కాలేజీల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే ప్రభుత్వం ఎందుకు సప్లమెంటరీ ఫీజు కట్టలేదని ప్రశ్నించారు. గురుకులాల విద్యార్థులు రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ దగ్గరకు వెళ్తే ఆయన ఏం చేయలేకపోయారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.


కేర్ టేకర్స్‌ను తొలగించారు..

గురుకులాల అసిస్టెంట్ కేర్ టేకర్స్‌ను అలుగు వర్షిని తొలగించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో సమ్మర్ క్యాంపులు పెట్టారని.. రేవంత్‌రెడ్డి పాలనలో సమ్మర్ క్యాంపులను రద్దు చేశారని ధ్వజమెత్తారు. అందాల పోటీలకు వచ్చిన వారికి 30 తులాల బంగారం ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వానికి బడ్జెట్ వస్తుంది.. కానీ పేద పిల్లల చదువుకు మాత్రం బడ్జెట్ లేదా అని నిలదీశారు. గురుకులాల్లో ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని అన్నారు. మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఎస్సీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. కాంగ్రెస్‌లోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు బానిస బతుకులు ఎందుకు బతుకుతున్నారని ప్రశ్నించారు. పేద ప్రజలపై బాధ్యత లేని అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గురుకులాలు రాష్ట్రంలో ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించారు. గురుకులాలను కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఉందని చెప్పారు. టాయిలెట్లను విద్యార్థులు కడగాలని ఆదేశాలు ఇచ్చిన అలుగు వర్షినిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలుగు వర్షినిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు

NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!

Read Latest Telangana News and National News

Updated Date - May 31 , 2025 | 04:22 PM