Share News

BRS MLC Kavitha: రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు: ఎమ్మెల్సీ కవిత

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:43 AM

నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు.. నోటీసులు ఇవ్వడాన్ని సహించమని రేవంత్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన‌ మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

BRS MLC Kavitha: రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు: ఎమ్మెల్సీ కవిత
BRS MLC Kavitha

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌కు (KCR) కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు, నిధులు తీసుకురావటం కేసీఆర్ చేసిన తప్పా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజులు కాదని.. 21పంపు హౌస్‌లు, కాళేశ్వరంతో 35శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఇవాళ(బుధవారం) ఇందిరాపార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా ఆమె ధర్నా చేశారు. అయితే ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ధర్నా జరగనుంది. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు కేసీఆర్‌కు నోటీసులిస్తే.. పోరాటం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్‌పై కవిత పరోక్ష విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడారు.


నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు.. రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని సహించమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన‌ గురువు చంద్రబాబు ఏపీకి గోదావరి జలాలను తరలించుకుపోతుంటే.. మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఆపమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదా అని నిలదీశారు. వెంటనే రేవంత్‌రెడ్డి.. ‌అపెక్స్ కౌన్సిల్, కేంద్రానికి‌ లేఖ రాయాలని కోరారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు‌లు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన‌ మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.


ఏపీ సీఎం చంద్రబాబు మీద ఆధారపడి బీజేపీ.. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అందుకే కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి‌ సంజయ్ బనకచర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ అయినా ఈ విషయంపై మాట్లాడాలని కోరారు. రైతులు, జాగృతి తరుపున మాట్లాడాలని ఈటలకు విజ్ఞప్తి చేశారు. నోరు కట్టేసుకుని అపవాదు తెచ్చుకోవద్దని ఈటల రాజేందర్‌ను కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈటల రాజేందర్ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కోరారు. గోదావరిలో వెయ్యి టీఎంసీల‌‌ నీళ్లు వచ్చేవరకు జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.


హైదరాబాద్‌కు శాశ్వతంగా నీటి అవసరాలు తీరుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. కేసీఆర్‌ది గట్టి గుండె కాబట్టే.. కాళేశ్వరం కట్టారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ కలలో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టలేదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల పేరుతో.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16టీఎంసీలు మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. కేసీఆర్ ..141 టీఎంసీలు తెలంగాణకు నిల్వ ఉండాలని కాళేశ్వరం కట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని విమర్శించారు. పర్మిషన్ ఉన్నప్పటికీ.. జాగృతి ధర్నాకు పోలీసులు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు. బైండోవర్ పేరుతో అరెస్టులు చేయటాన్ని ఆపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

మ్యాచ్‌ఫిక్సింగ్‌గా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు

అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 05:21 PM