Share News

MP Etala Rajender: ఎన్నికల్లో గెలిచే దమ్ము లేకే ఫోన్ ట్యాపింగ్.. బీఆర్ఎస్‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్

ABN , Publish Date - Jun 24 , 2025 | 02:43 PM

ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అధికారులందరూ కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు ప్రభాకర్‌రావు నిబంధనలు అతిక్రమించి మాజీ సీఎం కేసీఆర్‌ కోసం పనిచేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.

MP Etala Rajender: ఎన్నికల్లో గెలిచే దమ్ము లేకే ఫోన్ ట్యాపింగ్.. బీఆర్ఎస్‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
BJP Malkajgiri MP Etala Rajender

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి వాంగ్మూలాలను ఇవాళ(మంగళవారం) సిట్ అధికారులు నమోదు చేశారు. 2023 నవంబర్ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 4వేల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు కనుక్కున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో సిట్ ఎదుట ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈటల స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తనేనంటూ ఈటల ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, గన్‌మెన్‌లు ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు అంతకుముందు, తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్‌కి గురైనట్లు సిట్ గుర్తించింది. అలాగే.. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సిట్ అధికారులకి ఫిర్యాదు చేశారు. 2020 నుంచి 2024 వరకు తన ఫోన్ సంభాషణలను రహస్యంగా తెలుసుకున్నారని ఫిర్యాదులో మాధవరం కృష్ణారావు తెలిపారు. కుట్ర పూరితంగా కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్‌కి తెలంగాణ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెజండ్ల కిషోర్ బాబు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలను సిట్ అధికారులకి కిషోర్ బాబు ఇచ్చారు.


ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోంది: ఎంపీ ఈటల రాజేందర్

ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అధికారులందరూ కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు నిబంధనలు అతిక్రమించి కేసీఆర్‌ కోసం పనిచేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వలో అన్ని రంగాల్లోని ప్రముఖల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. సంఘవిద్రోహ శక్తులవి కాకుండా నాయకులు ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం దారుణమని ధ్వజమెత్తారు ఎంపీ ఈటల రాజేందర్.


తనతో పాటు తన కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హుజురాబాద్ ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్‌కి గురైందని ఆరోపించారు. తాను ఎవరితో మాట్లాడినా తన మాటలను విని తన వారిని బెదిరించేవారని చెప్పుకొచ్చారు. తమ నాయకులకు సంబంధించిన అన్ని సంభాషణలు కూడా వినేవారని అన్నారు. మునుగోడు బై ఎలక్షన్‌లో ఎక్కడ ఉంటున్నాం.. ఎవరితో మాట్లాడుతున్నాం, బీజేపీ ప్రణాళికలను కూడా పూర్తిగా వినేవారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై రేవంత్ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


బీజేపీని దెబ్బ తీయడానికే ఫోన్ ట్యాపింగ్‌: ప్రేమేందర్ రెడ్డి

తన రెండు ఫోన్లు ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశారని సిట్ అధికారులకు బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడటం సిగ్గు చేటని అన్నారు. రాజకీయ నేతల వ్యక్తిగత విషయాలు, జర్నలిస్ట్‌లవి, సినిమా వాళ్ల ఫోన్ కాల్స్ వినడం దారుణమని చెప్పారు. బీజేపీని దెబ్బ తీయడానికే ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడ్డారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ప్రేమేందర్ రెడ్డి.


ఫోన్ ట్యాపింగ్‌ కేసులో బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని ...కానీ కొద్ది మందిని మాత్రమే సాక్షులుగా పిలుస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. దేశ రక్షణ, భద్రత కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్.. రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దోషులు తెలియాలంటే రేవంత్ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో పలు సందర్భాల్లోనూ తన ఫోన్ ట్యాపింగ్‌ అయినట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల ఓడిపోయిందని ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో దారుణం.. కన్న కూతురుపై

రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్

ఏపీలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు అమోదం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 03:03 PM