Minister Nimmala: జగన్ హయాంలో ప్రకృతి విపత్తులు వస్తే గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ఫైర్
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:56 PM
గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే సాయం మాట అటు ఉంచి కనీసం పలకరించే వారే లేరని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు జగన్ గాలిలో పర్యటించి ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయని మంత్రి ఎద్దేవా చేశారు.
పశ్చిమగోదావరి, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)పై మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ప్రకృతి విపత్తులు వస్తే పట్టించుకోకుండా గాలికొదిలేశారని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన లక్ష్మీపాలెం, గంగడపాలెం గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ క్రమంలో తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకి ప్రభుత్వ సహాయం అందజేశారు. అలాగే, మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం,5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
మొంథా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో తీరని నష్టం కలిగిందని చెప్పుకొచ్చారు. తుఫాను చర్యలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడూ అధికారులని, మంత్రులని అప్రమత్తం చేశారని తెలిపారు. మొంథా తుఫాన్ తీరం దాటిన మరుసటి రోజు నుంచే కూటమి ప్రభుత్వంలో సహాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే సాయం మాట అటు ఉంచి కనీసం పలకరించే వారే లేరని విమర్శించారు. నాడు జగన్ గాలిలో పర్యటించి ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయని ఎద్దేవా చేశారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో గత వైసీపీ ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తే, నేడు రూ.20 వేలకు పెంచి ఇచ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం.. అయ్యప్ప స్వాములకి తీవ్రగాయాలు
Read Latest AP News And Telugu News