YS Sharmila: మహిళా సాధికారత పేరుతో మోసగిస్తున్నారు..షర్మిల విసుర్లు
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:48 PM
YS Sharmila: హింసకు కారణం అవుతున్న మద్యం, మత్తు పదార్థాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదని మండిపడ్డారు.

విజయవాడ: మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు చేశారు. మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ(శనివారం) విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో షర్మిల మాట్లాడారు. స్త్రీ లేకపోతే జననం లేదు... గమనం లేదు. అసలు సృష్టే లేదని ఉద్ఘాటించారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళ అని కొనియాడారు. స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని విమర్శించారు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదని వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు.
ఓటు బ్యాంక్ కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కగట్టిందని వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. వికసిత భారత్లో గంటకు 50 మంది మహిళలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 80 మంది మహిళలపై లైంగిక వేధింపులు జరగడం అత్యంత శోచనీయమని వాపోయారు. పేరుకే నారీశక్తి వందన్ ... కానీ ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని చెప్పారు. మహిళలను వేధించిన చరిత్ర బీజేపీ, దాని అనుబంధ సంఘాలదని ధ్వజమెత్తారు. మహిళల భద్రతపై ఎన్ని ఫాస్ట్రాక్ చట్టాలు. ఉన్నా... ఆచరణలో మహిళలకు న్యాయం శూన్యమని చెప్పారు. ఇటు రాష్ట్రంలో సైతం మహిళలకు గౌరవం లేదని వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు.
గడిచిన పదేళ్లలో 2 లక్షల మంది మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయని వైఎస్ షర్మిలా రెడ్డి గుర్తుచేశారు. గత ఐదేళ్లలో 25 శాతం అఘాయిత్యాలు పెరిగాయన్నారు. 54 వేల మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదు కావడం అత్యంత దారుణమన్నారు. మహిళలపై దాడుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండటం సిగ్గుచేటుని అన్నారు. హింసకు కారణం అవుతున్న మద్యం, మత్తు పదార్థాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. మరోవైపు మహిళా సాధికారత అంటూ చేస్తున్నది కూడా మోసమేనని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు , నెలకు రూ.15 వందల ఆర్థిక సహాయం, సున్నా వడ్డీకే రుణాలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు లాంటి పథకాలు ఇస్తామని.. మహిళలకు టోకరా పెట్టారు తప్పిస్తే ఉద్ధరించింది శూన్యమని వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా ఏపీ
Venkaiah Naidu: ఉన్నత విద్యలో మార్పుతోనే దొరస్వామికి నివాళి
Power Tariff: విద్యుత్ ట్రూ అప్ పాపం వైసీపీదే
Read Latest AP News and Telugu News