Minister Kollu Ravindra: ఏపీ పరువును రోడ్డున పడేశారు.. జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
ABN , Publish Date - May 21 , 2025 | 06:28 PM
Minister Kollu Ravindra: వైసీపీ నేతలు చేసిన పాపాలే.. నేడు వారిపాలిట శాపంగా మారాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.

కృష్ణా: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కుంభకోణాలతో ఏపీ పరువును రోడ్డున పడేశారని ఆరోపణలు చేశారు. గత ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలు బయటపడుతుంటే బుకాయింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న అధికారులను భయపెట్టేలా జగన్, వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారులను భయపెట్టినా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ నేతలు చేసిన పాపాలే.. నేడు వారిపాలిట శాపంగా మారాయని విమర్శలు చేశారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.
జీవిత బీమా ఇచ్చి ఆదుకుంటున్నాం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పార్టీ సభ్యత్వమున్న వారందరికీ జీవిత బీమా ఇచ్చి ఆదుకుంటున్నామని అన్నారు. ఇవాళ(బుధవారం) పల్నాడు జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యకర్త చనిపోతే రూ.5 లక్షల జీవిత బీమాను టీడీపీ అందిస్తుందని చెప్పారు. 43 ఏళ్లు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిందని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని అన్నారు. తోట చంద్రయ్యను వైసీపీ నాయకులు అతి దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన చంద్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వ ఉద్యోగంతో ఆదుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఆ కుటుంబాలను తిరిగి స్వగ్రామాలకు తీసుకొచ్చి ఆర్థికంగా టీడీపీ ఆదుకుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
ఆ విషయంపై కేంద్రమంత్రితో మాట్లాడా: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ప్రజా శ్రేయస్సుకు పాటుపడతామనే కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చారని తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పల్నాడులో తెలుగుదేశం జెండా ఎగురవేశామని ఉద్ఘాటించారు. పార్టీ బాగుంటేనే అంతిమంగా తానైనా, శ్రేణులైనా బాగుండేదని చెప్పారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి పరిష్కారమయ్యేలా చూస్తున్నామని అన్నారు. ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లుల విషయంపై కేంద్రమంత్రితో మాట్లాడామని గుర్తుచేశారు. త్వరలోనే పెండింగ్ బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.
వైసీపీ నియంత పాలనను బంగాళాఖాతంలో కలిపాం: జీవీ ఆంజనేయులు
టీడీపీ కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణంతోనే అధికారంలోకి వచ్చామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు, అధికారం కల్పిస్తున్నామని చెప్పారు. కార్యకర్తల పోరాటంతోనే వైసీపీ నియంత పాలనను బంగాళాఖాతంలో కలిపామని విమర్శించారు. గత జగన్ ప్రభుత్వం ఏపీపై రూ.10 లక్షల కోట్ల రుణభారం మోపిందని ఆరోపణలు చేశారు. ఆర్థిక సంక్షోభంలో కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని రాజీ పడకుండా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని ఉద్ఘాటించారు. ప్రజల తలసరి ఆదాయాన్ని 2047 నాటికి రూ.58.14 లక్షలకు చేరేలా కృషి చేస్తున్నారని అన్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యేది లేదని.. వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతి స్థాయిలో కార్యకర్తకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి నెలా సంక్షేమం అందేలా ఏడాది క్యాలెండర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేశారని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా
Photo Controversy: మారని అధికారులు.. జడ్పీ ఆఫీస్లో జగన్ ఫోటో.. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు
Minister Lokesh: కార్యకర్తల బాధ్యత నాదే.. ఇకపై నేరుగా కలుస్తా.. లోకేష్ కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News