Cyclone Montha: బాధితులకు నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలి: మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:15 PM
మొంథా తుఫాను దృష్ట్యా వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను (Cyclone Montha) దృష్ట్యా వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) దిశానిర్దేశం చేశారు. మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఇవాళ(బుధవారం) రాష్ట్ర సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ సీఎస్ కె.విజయానంద్, ఆర్టీజీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్.
వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ను పునరుద్ధరించాలని ఆజ్ఞాపించారు. వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంటనష్టం అంచనాలను రూపొందించాలని నిర్దేశించారు. మొంథా తుఫాను ప్రభావంతో జరిగిన ప్రాణనష్టం, దెబ్బతిన్న నిర్మాణాలను అధిాకారులు నివేదించాలని సూచించారు మంత్రి నారా లోకేష్.
వంతెనలు, కల్వర్టులను పర్యవేక్షించడంతో పాటు వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువగట్లను పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు పాముకాటుకు ఉపయోగించే యాంటీ వీనం ఔషధాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మత్స్యకారులు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్
మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..
Read Latest AP News And Telugu News