Minister Uttam: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలి
ABN , Publish Date - May 30 , 2025 | 02:45 PM
ఎస్ఎల్బీసీ ప్రమాదం దురదృష్టకరమని...అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి హామీ ఇచ్చారు.

సూర్యాపేట: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలని.. పాలనలో గాడితప్పితే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Minister Uttam Kumar Reddy) హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో అధికంగా వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని ప్రకటించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టంచేశారు. ఇవాళ(శుక్రవారం) సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. రేషన్లో బియ్యంతో సహా నిత్యావసరాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఐదేళ్లలో ఉమ్మడినల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం దురదృష్టకరమని...అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. డెన్మార్క్ లేటెస్ట్ పరిజ్ఞానంతో ఎస్ఎల్బీసీ పనులు మొదలు పెడతామని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఉదయ సముద్రం పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆపేశారని మండిపడ్డారు. దేవాదుల ఫేస్2 ద్వారా తుంగతుర్తికి గోదావరి జలాలు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే కాళేశ్వరం మేడిగడ్డ కూలిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కాళేశ్వరం నీళ్లు లేకుండానే ఎక్కువ వరి పంట పండించామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు.
సమస్యలు ఉన్నా.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఆర్ధిక సమస్యలు ఉన్నా అన్ని రంగాల్లో సంక్షేమం కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు. కరువు జిల్లా నుంచి దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎదిగిందని ఉద్ఘాటించారు. ఎన్ని సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇళ్లు లేని ప్రతి నిరుపేదకి లబ్ధి జరుగుతుందని.. తొందరపడవద్దని అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పూర్తి స్థాయిలో కృష్ణా , గోదావరి నీటిని వినియోగిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకి లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు అనుకూలంగా ఉందని వెల్లడించారు. ఆయిల్ పాం సాగుకు అనుకూలంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కరీంనగర్ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
ఈ ఔషధాలను పరిమితికి మించి వాడుతున్నారా.. కిడ్నీలు రిస్క్లో పడ్డట్టే
Read Latest Telangana News And Telugu News