CPI Narayana: రాష్ట్రాలకు ఉన్న హక్కులను బీజేపీ హరిస్తుంది
ABN , Publish Date - May 24 , 2025 | 10:00 PM
CPI Narayana: బీజేపీపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను బీజేపీ హరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో వక్ఫ్ బోర్డు చట్టం తీసుకుని వచ్చారని నారాయణ చెప్పారు.

ఖమ్మం జిల్లా: తెలంగాణ, ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో ఇటీవల నక్సలైట్లను చంపిన ఘటన బాధాకరమని సీపీఐ జాతీయ నాయకులు నారాయణ (CPI Leader Narayana) తెలిపారు. దేశమంతా బాధపడుతుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం సంతోషపడుతున్నారని విమర్శించారు. 2026 లోగా నక్సలిజాన్ని రూపుమాపుతామని మోదీ, అమిత్ షా చెబుతున్నారని అన్నారు. మనుషులను చంపగలరు కానీ సిద్ధాంతాలను చంపలేరని చెప్పారు. ఇలాంటి అమిత్ షాలు వెయ్యిమంది వచ్చిన నక్సలిజాన్ని చంపలేరని తెలిపారు.
ఇవాళ(శనివారం) నల్లమల గిరిప్రసాద్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. నల్లమల గిరిప్రసాద్ వర్ధంతిలో పాల్గొనడం ఒక వైపు బాధగా ఉందని.. మరో వైపు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. తాను జిల్లాలో ఉన్నప్పుడు చాలా సమస్యలు వచ్చాయని, గిరిప్రసాద్ ప్రత్యక్షంగా వచ్చి వాటిని పరిష్కరించేవారని గుర్తుచేశారు. ఆయన చివరి ఊపిరి పోయేవరకు కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి కోసం పని చేశారని ఉద్ఘాటించారు. మోదీ, అమిత్షాలు ఎంతమంది విప్లవకారులను చంపిన సిద్ధాంతాన్నిమాత్రం చంపలేరని అన్నారు. నక్సలైట్లు ప్రమాదకరమని మీరు అంటున్నారు.. కానీ రాజ్యాంగానికి ప్రమాదకరం బీజేపీనే అని నారాయణ విమర్శలు చేశారు.
రాష్ట్రాలకు ఉన్న హక్కులను బీజేపీ హరిస్తోందని నారాయణ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో వక్ఫ్బోర్డు చట్టం తీసుకుని వచ్చారని చెప్పారు. ఓట్ల కోసం పదవి కాపాడుకోవటానికి దేశం విచ్ఛిన్నమైన పర్వాలేదా అని నిలదీశారు. ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులను కొంతమంది ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మన దగ్గర రాజకీయాలు వ్యాపారం అయిపోయాయని ఆరోపించారు. ఉదయం ఒక పార్టీ, సాయంత్రం మరో పార్టీలోకి మారుతున్నారని చెప్పారు. గతంలో రౌడీలు రోడ్లపై గొడవలు పడేవారని, వారంతా ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారని విమర్శలు చేశారు. సీపీఐ, సీపీఏం ఒకటి కావాలని, ముందు మనం కలిస్తే లెఫ్ట్ పార్టీలకు బలం వస్తుందని చెప్పారు. వామపక్ష యోధులు ఒక్కటి కావాల్సిందేనని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Seethakka: అధికారులు ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం సహకరించాలి
KTR On Kavitha Letter: కాక రేపుతున్న కవిత లేఖ.. కేటీఆర్ ఏమన్నారంటే
For More Telangana News and Telugu News..