Share News

CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజన.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 28 , 2025 | 06:17 PM

అభివృద్ధిలో స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అన్నారు. భాగ్యనగర అభివృద్ధికి ఎవరూ అడ్డుపడినా ఊరుకునేది లేదని హెచ్చరిచారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధిపైనే తమ దృష్టి అని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజన.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana CM Revanth Reddy

హైదరాబాద్: 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందని.. శేరిలింగంపల్లి 4 నియోజకవర్గాలుగా మారుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ప్రకటించారు. హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చడంలో పీజేఆర్‌ది కీలకపాత్ర అని కొనియాడారు. పీజేఆర్‌ కృషి వల్లే హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా జలాలు వచ్చాయని ఉద్ఘాటించారు. ఇవాళ(శనివారం) పీజేఆర్‌ ఫ్లైఓవర్‌‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కొండాపూర్‌-గచ్చిబౌలి మార్గంలో 6 లైన్లతో 1.2 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌‌ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. రూ.182.72 కోట్ల వ్యయంతో ORR నుంచి కొండాపూర్‌ వరకు ఫ్లైఓవర్‌‌ నిర్మాణం చేపట్టింది. పీజేఆర్‌ ఫ్లైఓవర్‌‌‌తో గచ్చిబౌలి చౌరస్తా దగ్గర ట్రాఫిక్‌ సమస్య తగ్గనుంది. పీజేఆర్‌ ఫ్లైఓవర్‌‌ని ప్రారంభించిన అనంతరం మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉపాధి కోసం చాలామంది హైదరాబాద్‌ వస్తుంటారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి.


పేదల నాయకుడిగా పీజేఆర్‌ గొప్పపేరు సంపాదించారని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ప్రశంసించారు. ప్రజలు ఎప్పుడు పిలిచినా పలికే నాయకుడు పీజేఆర్‌ అని అభివర్ణించారు. గతంలో పీజేఆర్‌ ఇల్లు ఒక జనతా గ్యారేజ్‌లా కనిపించేదని గుర్తుచేసుకున్నారు. జంటనగరాల్లో 25 ఏళ్లపాటు పీజేఆర్‌ శకం నడిచిందని గుర్తుచేసుకున్నారు. పీజేఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడే హైటెక్‌ సిటీకి పునాది పడిందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి.


గతంలో హైటెక్‌ సిటీని ముందుకు తీసుకెళ్లింది చంద్రబాబే అని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఉద్ఘాటించారు. భాగ్యనగర అభివృద్ధికి ఎవరూ అడ్డుపడినా ఊరుకునేది లేదని హెచ్చరిచారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధిపైనే తమ దృష్టి అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చాలని కోరారు. అభివృద్ధిలో స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కొందరూ అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయం ముసుగులో అవాంతరాలు కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేంద్రం సహకరించడం లేదు

‘హైదరాబాద్‌లో ఆర్టీసీ డీజిల్ బస్సులు ఉండొద్దని నిర్ణయించాం. డీజిల్‌ బస్సులను జిల్లాలకు తరలించాలని ఆదేశించాం. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు పన్ను మినహాయింపు. ఆటోలు కూడా CNG, ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లోకి మారాలి. హైదరాబాద్ నగరంలో అనేక నాలాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఆక్రమణలకు గురైన వాటిని హైడ్రా ద్వారా తొలగిస్తున్నాం. N కన్వెన్షన్‌లో రెండెకరాలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించి.. నటుడు నాగార్జున నిజమైన హీరో అనిపించుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు శ్రీధర్‌బాబును ఇన్‌చార్జి మంత్రిగా చేశాం. రంగారెడ్డి జిల్లా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదు. రేపు అమిత్‌ షా తెలంగాణకు వస్తున్నారు.. మరోసారి కలిసి విజ్ఞప్తి చేస్తాం. రాజకీయాలు వదిలేసి హైదరాబాద్‌ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం.నేను దాదాపు 35 సార్లు ఢిల్లీ వెళ్లా. ప్రధాని సహా అనేకమంది కేంద్రమంత్రులను కలిశా. కానీ రాష్ట్రానికి కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు రాలేదు. హైదరాబాద్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం ఇచ్చారు. ఈ విషయం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చారు. కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఏం తెచ్చారో చెప్పగలరా’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

దేశ రాజధానిలో బోనాల జాతర

యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 06:42 PM