Mall Bhatti Vikramarka: సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:12 PM
బోనాలు తెలంగాణ సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గోల్కొండలో మొదలైన ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు.

హైదరాబాద్: బోనాలు తెలంగాణ సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. గోల్కొండలో మొదలైన ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇవాళ(ఆదివారం) లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. అమ్మవారికి మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మల్లు భట్టి విక్రమార్కని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బోనాలు ప్రశాంతంగా అత్యంత భక్తి భావంతో కొనసాగుతున్నాయని తెలిపారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలను చల్లగా చూడమని వేడుకున్నానని అన్నారు. దాదాపు రూ.1290 కోట్లతో దేవాదాయ శాఖకు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. రూ.20 కోట్ల నిధులు హైదరాబాద్లో బోనాల కోసం విడుదల చేశామని ప్రకటించారు. ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అమ్మవారి దర్శించుకున్న ప్రముఖులు
సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం పలువురు ప్రముఖులు క్యూ కడుతున్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ కవిత, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన దర్శించుకున్నారు.
లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో మొదటిసారి పాల్గొన్నా:మంత్రి వాకాటి శ్రీహరి
లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మొదటిసారి పాల్గొన్నానని మంత్రి వాకాటి శ్రీహరి తెలిపారు. అమ్మవారి దయతో అందరూ సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రభుత్వానికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మంత్రి వాకాటి శ్రీహరి కోరుకున్నారు.
అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
అమ్మవారి బోనాల జాతరలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు కవిత. తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. సుమారు 117 సంవత్సరాల చరిత్ర అమ్మవారికి ఉందని తెలిపారు. అమ్మవారి దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత కోరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News