Mahesh Goud: తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్లపై మహేష్ గౌడ్ ఫైర్
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:45 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్రావుకి (Harish Rao) టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు నీటి వాటాను కాలరాసిందే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావులు అని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. ఒక్క నీటి బొట్టు కూడా వదలబోమని సీఎం రేవంత్రెడ్డి అనుకున్నారని.. కాబట్టే బనకచర్ల పనులు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్లో మహేష్గౌడ్ మీడియాతో మాట్లాడారు.
కవిత బీసీల కోసం ఉద్యమం ఎక్కడ చేసింది: మహేష్ గౌడ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్లు బీసీలకు కేసీఆర్ చేసింది ఏంటని నిలదీశారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కవిత ఇప్పటిదాకా బీసీల కోసం ఒక్కమాట అయినా మాట్లాడారా అని నిలదీశారు. రాజకీయ శూన్యంలో ఉన్న కవిత.. తన ఉనికి కోసమే మాట్లాడుతోందని చెప్పుకొచ్చారు. కేసీఆర్తో ఆస్తి పంపకాల వాటా కోసమే కవిత తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతోందని విమర్శించారు. కవిత బీసీల కోసం ఉద్యమం ఎక్కడ చేసిందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.
బీజేపీకి మహేష్ గౌడ్ కౌంటర్
బీజేపీకి మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం బీసీ నాయకుడు దొరకలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అనేకమందికి అవకాశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. మైనార్టీలకు త్వరలోనే అవకాశం ఇస్తామని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై మహేష్ గౌడ్ సీరియస్
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్గా ఉంటామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
రేపటి సభకు సామాజిక న్యాయ సమరభేరిగా నామకరణం చేశాం: మహేష్ గౌడ్
రేపటి సభకు సామాజిక న్యాయ సమరభేరిగా నామకరణం చేశామని మహేష్ గౌడ్ తెలిపారు. ఈరోజు (గురువారం) సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే హైదరాబాద్కి వస్తున్నారని చెప్పారు. రేపు (శుక్రవారం) పీఏసీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారని అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో గ్రామ అధ్యక్షుల సమావేశాల్లో ఖర్గే పాల్గొంటారని చెప్పుకొచ్చారు. రేపటి సమావేశంలో పలువురు గ్రామ, జిల్లా కమిటీల అధ్యక్షులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఎల్బీ స్టేడియానికి వస్తారని మహేష్ గౌడ్ వెల్లడించారు.
కాగా..గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్కి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రానున్నారు. తాజ్ డెక్కన్ హోటల్లో ఖర్గే బస చేయనున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం 10:30కి గాంధీ భవన్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరుగనుంది. 12 గంటలకు పీసీసీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశంలో ఖర్గే పాల్గొననున్నారు. రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చించనున్నారు. సాయంత్రం LB స్టేడియంలో గ్రామ అధ్యక్షుల సభలో ఖర్గే పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి
ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్
వరంగల్ ఇష్యూ.. మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు
Read latest Telangana News And Telugu News