Harish Rao: ఆ విషయం నిరూపించూ.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్రావు మాస్ సవాల్
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:24 PM
సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ రైతుబంధు వేస్తామన్నారని.. ఇప్పటికీ ఇంకా రైతులందరికీ రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదని మాజీమంత్రి హరీష్రావు నిలదీశారు. రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదని హరీష్రావు అన్నారు.

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాజీలేని పోరాటం చేసి తెలంగాణ సాధించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకునేవారమా అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే కొంతమంది కాంగ్రెస్, బీజేపీ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆ సమయంలో రాజీనామా చేయమంటే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాజీనామా చేయని నేతలు ఈరోజు కేసీఆర్ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు హరీష్రావు.
తెలంగాణ భవన్లో ఇవాళ(జూన్2) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భగా మీడియాతో హరీష్రావు మాట్లాడారు. తెలంగాణను కేసీఆర్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపితే.. రేవంత్రెడ్డి అబద్దాల్లో అగ్రగామిగా నిలిపారని మండిపడ్డారు. తెలంగాణ అక్కాచెల్లెళ్లను రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు రూ.21వేల కోట్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చినట్లు నిరూపించాలని సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు సవాల్ చేశారు. రూ.21వేల కోట్ల జీవో చూపించి రేవంత్రెడ్డి నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని హరీష్రావు ఛాలెంజ్ చేశారు. రైతులు ధాన్యం కుప్పలపై మరణిస్తే.. రేవంత్రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలారని విమర్శించారు. రైతు రుణమాఫీ ఈ రోజుకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్రావు.
మార్చి 31వ తేదీ వరకు రైతులందరికీ రైతుబంధు వేస్తామన్నారని...ఇప్పటికీ ఇంకా రైతులందరికీ రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని మీ ఇంజనీర్లే నివేదిక ఇచ్చారని తెలిపారు. రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్రెడ్డి చెప్పడం సరికాదని హరీష్రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జీహెచ్ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
Read Latest Telangana News And Telugu News