CM Revanth Reddy: లైఫ్ సైన్సెస్ రంగంలో చారిత్రక మైలురాయిగా హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి
ABN , Publish Date - Aug 04 , 2025 | 01:13 PM
లైఫ్ సైన్సెస్ కేపిటల్గా హైదరాబాద్కు గుర్తింపు ఉందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పది శాతం తెలంగాణ నుంచే అందిస్తామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచే నలబై శాతం ఫార్మా ఉత్పత్తులు వస్తున్నాయని వెల్లడించారు. హైదరాబాద్లోనే అత్యధిక వ్యాక్సిన్ల తయారీ ఉందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఫార్మా కంపెనీలకు ప్రత్యేక జీనోమ్ వ్యాలీ ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్ ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు ఇవాళ్టి ఈ కార్యక్రమమే తిరుగులేని నిదర్శనమని నొక్కిచెప్పారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధి, దృష్టికోణం, కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఈ విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించిన మంత్రి శ్రీధర్ బాబుకి, జయేష్ రంజన్కి, పాలుపంచుకున్న అధికారులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు సీఎం రేవంత్రెడ్డి.
ఇది తెలంగాణ రైజింగ్..
ఇది తెలంగాణ రైజింగ్ (Telangana Rising) 2047 దిశగా తాము వేసిన మరొక ముఖ్యమైన అడుగని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) గచ్చిబౌలిలో ప్రముఖ లిల్లీ ఫార్మా కంపెనీని ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీని సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎలీ లిల్లీ (Eli Lilly) సంస్థ లీడర్ షిప్ను, ఉద్యోగులను హైదరాబాద్ నగరానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని వెల్లడించారు. తెలంగాణపై నిరంతర నమ్మకం ఉంచి, అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నందుకు పారిశ్రామికవేత్తలు-పెట్టుబడిదారులు, ప్రపంచ శ్రేణి కార్పొరేషన్లకు, కంపెనీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ప్రారంభమైన ఎలీ లిల్లీ నూతన కేంద్రం… ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు సీఎం రేవంత్రెడ్డి.
హైదరాబాద్లో టాలెంట్, లీడర్షిప్..
‘ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటి చెప్పినట్లే. హైదరాబాద్ నగరంలో టాలెంట్, లీడర్షిప్, విజన్, మంచి పాలసీ, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందుకే ఎలీ లిల్లీ లాంటి గ్లోబల్ లీడర్కు ఇది అనుకూలమైన కేంద్రంగా మారింది. భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందింది. 2000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. 200కు పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరం నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. భారత్లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి మూడు టీకాల్లో ఒకటి హైదరాబాద్లో అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం మాకు గర్వకారణం. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ, భారతదేశంలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశోధన - అభివృద్ధి సముదాయంగా నిలిచింది’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
బయోటెక్నాలజీ సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్..
‘ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారింది. ఈరోజు, ఎలీ లిల్లీ సంస్థ రాకతో, లైఫ్ సైన్సెస్ రంగంలో మేము మరో మెట్టుకు చేరుకున్నాం. మధుమేహం, అంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ రంగాల్లో ఎలీ లిల్లీ సంస్థ కృషి ఒక గేమ్ ఛేంజర్గా నిలిచిపోతుంది. ఎలీ లిల్లీ సంస్థ చేసిన కృషి మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేయడంతో వారిని రక్షించడానికి తోడ్పడింది. నేను, మా ప్రభుత్వం అన్ని వేళలా మీకు అండగా ఉంటాం. పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తాం. హైదరాబాద్లో పని చేయబోయే ఎలీ లిల్లీ ఉద్యోగులు.. కేవలం హైదరాబాద్లో నివసించడం, పనిచేయడం మాత్రమే కాదు ఇప్పుడు మీరు మా కుటుంబ సభ్యులుగా మారారు. మీరు హైదరాబాద్ నుంచి గ్లోబల్ హెల్త్కేర్ భవిష్యత్తును తీర్చిదిద్దనున్నారు. మీ సహకారంతో, తెలంగాణను భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మాత్రమే కాకుండా…. ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్గా తీర్చిదిద్దుతాం. మనమందరం కలిసి కొత్త ఆవిష్కరణలకు కృషి చేద్దాం, ప్రజల జీవితాలను మారుద్దాం, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్: నిర్మిద్దాం’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్ ఫోకస్
డ్రగ్స్ కేసుల్లో పబ్బులకు లింకులు
Read latest Telangana News And Telugu News