BJP MP Laxman: మోదీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పోతున్నారు.. ఖర్గేపై బీజేపీ ఎంపీ ఫైర్
ABN , Publish Date - May 27 , 2025 | 05:26 PM
మల్లికార్జున ఖర్గే 11 ఏళ్ల మోదీ పాలనను పీడకలగా చెప్పడం సరికాదని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమర్జెన్సీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఓ పీడకల అని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్ను అడుగు అడుగునా అడ్డుకుంది ప్రతిపక్షనేత రాహుల్ గాంధీనే అని లక్ష్మణ్ విమర్శించారు.

హైదరాబాద్: మోదీ పాలనలో న్యాయవ్యవస్థ బలోపేతం అయిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ (BJP MP Laxman) ఉద్ఘాటించారు. కాంగ్రెస్ (Congress) హయాంలో దేశం ఎకానమీలో పదోస్థానంలో ఉండేదని.. మోదీ పాలనలో 4వ అతిపెద్ద ఎకానమీ దేశంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిందని.. అయినా ప్రధానిగా మోదీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమనేది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా చూడాలని తెలిపారు లక్ష్మణ్.
గతంలో అంజయ్యకు అవమానం జరిగిందని.. ఇప్పుడు రేవంత్రెడ్డికి జరుగుతుందని లక్ష్మణ్ గుర్తుచేశారు. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిస్తే చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. కొంతమంది ఆపరేషన్ సిందూర్ను, ఆర్మీని అవమానించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిందని తెలుస్తోందని అన్నారు లక్ష్మణ్.
గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ నోటీసులకు సమాధానం ఇస్తారని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. మల్లికార్జున ఖర్గే 11 ఏళ్ల మోదీ పాలనను పీడకలగా చెప్పడం సరికాదని అన్నారు. ఎమర్జెన్సీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఓ పీడకల అని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్ను అడుగు అడుగునా అడ్డుకుంది ప్రతిపక్షనేత రాహుల్ గాంధీనే అని విమర్శించారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేయలేనిది మోదీ 11 ఏళ్లలో చేశారని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో దేశం అగ్రస్థానంలో ఉందని లక్ష్మణ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ రూ. 50లక్షల కోట్లలో.. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 11లక్షల కోట్లను మోదీ కేటాయించారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. మోదీ హయాంలో దేశం వందశాతం అభివృద్ధి చెందితే కాంగ్రెస్ హయాంలో 50శాతం కూడా అభివృద్ధి చెందలేదని విమర్శించారు. మోదీ హయాంలో 7.4శాతం జీడీపీ వృద్ధి చెందిందని గుర్తుచేశారు. అతి త్వరలోనే మూడో ఆర్థిక దేశంగా భారతదేశం అవతరించపోతుందని ఉద్గాటించారు. ఇప్పటికైనా మల్లికార్జునఖర్గే ఆలోచించి మాట్లాడాలని లక్ష్మణ్ హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి
జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News