ACB Raids: తెలంగాణలో సంచలనం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:56 AM
తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకకాలంలో నూనె శ్రీధర్కి సంబంధించి 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ(బుధవారం) తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ(బుధవారం) తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఏకకాలంలో నూనె శ్రీధర్కి సంబంధించి 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. నూనె శ్రీధర్ని అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) దగ్గర శ్రీధర్ పనిచేశారు. నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ అధికారులు నమోదు చేశారు. అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో నూనె శ్రీధర్ పనిచేస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో నాలుగు చోట్ల హైదరాబాద్లో ఆరు చోట్ల రైడ్స్ చేస్తున్నారు.
కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతో పాటు తొమ్మిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. శ్రీధర్కి సంబంధించిన బంధుమిత్రులు కుమారుడితో పాటు తన సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్లో శ్రీధర్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్కి ఏసీబీ అధికారులు తీసుకువస్తున్నారు. కాళేశ్వరంలో కీలకమైన గాయత్రీ పంప్హౌస్ బాధ్యతలను శ్రీధర్ చూశారు. గాయత్రీ పంప్ హౌస్లను బాహుబలి మోటార్లుగా గత కేసీఆర్ ప్రభుత్వం భావించింది. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో భారీ పంప్ హౌస్లు నిర్మించింది.
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్
కాగా, కాళేశ్వరం కమిషన్ విచారణకు ఇవాళ(బుధవారం) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. ఉదయం 11:30 గంటలకు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని విచారించనుంది. కాళేశ్వరం రీడిజైన్, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు స్థల మార్పు, అంచనాల పెంపు, అప్పులు చెల్లింపులు కేబినెట్ ఆమోదంపై కేసీఆర్ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ఇప్పటికే చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నావళిని సిద్ధం చేశారు.
మొదట ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకాలేనని మరో తేదీన వస్తానని కమిషన్కి కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఈరోజు(జూన్11)వ తేదీ విచారణకు రావాలని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆదేశించారు. ఇప్పటివరకు 114 మందిని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారించారు.
అయితే, కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్కు చేరింది. చివరి దశ విచారణలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పెద్దలను కమిషన్ విచారిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఫైనాన్స్ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్రావును కాళేశ్వరం కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. చివరిగా ఈరోజు కేసీఆర్ని కమిషన్ చైర్మన్ పీసీగోష్ విచారించనున్నారు. కేసీఆర్తో కమిషన్ విచారణ ముగియనుంది. ఇప్పటికే 300 పేజీలతో నివేదికను కమిషన్ చైర్మన్ సిద్ధం చేశారు. కేసీఆర్ విచారణ అనంతరం తుది నివేదికను సిద్ధం చేసి జూలైలో తెలంగాణ ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
For More Telangana News and Telugu News..