Share News

Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..

ABN , Publish Date - May 16 , 2025 | 08:17 PM

విజయవాడలో భారత సైనికులకు మద్దతుగా శుక్రవారం నాడు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

 Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..
Tiranga Rally

విజయవాడ: భారతమాత కీర్తి పతకాన్ని చాటుతూ తిరంగా ర్యాలీ చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. తీవ్రవాదం రూపంలో ఎవరూ దేశంలో అడుగుపెట్టినా వారికదే చివరిరోజు అని హెచ్చరించారు. జాతి పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలో ఇవాళ(శుక్రవారం) భారీ తిరంగా ర్యాలీని కూటమి నేతలు నిర్వహించారు. ఇందీరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. ఇందీరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద తిరంగా ర్యాలీని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, కార్యకర్తలు, విజయవాడ నగరవాసులు భారీగా పాల్గొన్నారు. జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీకి నగరవాసులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ లాంటి కార్యక్రమాలకు దేశం సిద్ధమని, ఇదే ప్రపంచంలోని ఉగ్రవాదులకు హెచ్చరిక కావాలని చంద్రబాబు అన్నారు.


ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మోదీ: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu

ఈ సందర్భంగా భారత రక్షణ దళాలకు సీఎం చంద్రబాబు సెల్యూట్ చేశారు. పహల్గామ్ ఘటనలో ఆడబిడ్డల కుంకుమ చెరిపేసిన వాళ్లు ఈ భూమ్మీద ఉండకూడదనే ఆపరేషన్ సిందూర్ చేపట్టారని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మోదీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. త్రివర్ణ పతాక రూపశిల్పి ఈ ప్రాంతం వారేనని గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్‌కు నివాళులు అర్పించారు చంద్రబాబు. పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు భారతదేశాన్ని ఏం చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వారిని తుదముట్టించాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని చెప్పుకొచ్చారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలను మోదీ తీసుకుంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


సెలబ్రిటీస్ నుంచి దేశభక్తి ఆశించవద్దు: పవన్ కల్యాణ్

Pawan Kalyan

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ భారతదేశంలో పాకిస్థాన్ వల్ల ఎప్పుడు ప్రశాంతత చూడలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతుంటే పాకిస్థాన్ చూసి ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే బోర్డర్‌లో దేశాన్ని కాపాడుతున్న సైనికుల వల్లే అది సాధ్యమవుతోందని తెలిపారు. దేశం కోసం పోరాడిన మురళీనాయక్ లాంటి సైనికులు దేశానికి నిజమైన నాయకులని పవన్ చెప్పుకొచ్చారు. చనిపోతే సైనికుడిగా దేశం కోసం పోరాడిన మురళీ నాయక్‌లాగా చనిపోవాలని అన్నారు. సెలబ్రిటీస్ నుంచి దేశభక్తి ఆశించవద్దని... సినిమా హీరోలంతా దేశాన్ని నడిపేవారు కాదని అన్నారు. వాళ్లంతా ఎంటర్‌‌టైన్ చేసేవాళ్లు మాత్రమేనని పేర్కొన్నారు. శాంతి వచనాలు ఇక పని చేయవని.. పాకిస్థాన్ వాళ్లు భారత్‌లోకి వచ్చి కొడితే వాళ్ల సరిహద్దు దాటి వారి ఇళ్లల్లోకి వెళ్లి మనం కొడతామని పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.


పాకిస్థాన్‌కు ధీటుగా జవాబు ఇచ్చాం: దగ్గుబాటి పురంధేశ్వరి

daggubati purandeswari.jpg

భారతదేశ ఐక్యమత్యాన్ని చాటేందుకు తిరంగా యాత్రకు ప్రజలు భారీగా తరలి వచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. 2014 సంవత్సరం నుంచి సమర్ధవంతమైన నాయకత్వం దేశానికి లభించిందని గుర్తుచేశారు. దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తే.. ఎదురుదాడి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇటీవల మన వాళ్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటనలో పాకిస్థాన్‌కు జవాబు దీటుగా ఇచ్చామని దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు.


పాకిస్థాన్ తోకముడిచింది..

‘మన పౌరులపై పాకిస్థాన్ దాడులు చేస్తే.. వారి స్థావరాలను ధ్వంసం చేశాం. సరిహద్దుల్లో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశప్రజలకు రక్షణ వలయంగా నిలబడుతున్న సైనికులకు, ప్రధాని మోదీకి సంఘీభావంగా ఈ తిరంగా యాత్ర చేపట్టాం. ఈ యాత్రకు అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. మన రాష్ట్రానికి చెందిన ముద్దుబిడ్డ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో దీటైన సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదం, చర్చలు సమాంతరంగా వెళ్లలేవు. ఉగ్రవాదం, వాణిజ్యం సమాంతరంగా వెళ్లకూడదని మోదీ స్పష్టంగా చెప్పారు. నీరు, రక్తం సమాంతరంగా పారలేవనే ధృడమైన సందేశాన్ని ప్రధాని మోదీ పొరుగు దేశానికి ఇచ్చారు. పాకిస్థాన్ నేడు తోకముడిచి మన ప్రభుత్వానికి సింధూ జలాలను వదలాలని లేఖ రాసింది. మన దేశం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సైనికులకు అండగా ఉంటూ ప్రజలంతా సంఘీభావం తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే స్పూర్తితో సైనికులు, మోదీకి ప్రజలంతా అండగా ఉండాలి’ అని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 16 , 2025 | 09:06 PM