Nara Lokesh: టీడీపీ కార్యకర్తల పోరాటంతో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది: లోకేష్
ABN , Publish Date - May 29 , 2025 | 04:29 PM
నకిలీ మద్యంతో వేలకోట్లు లూటీ చేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. గతంలో ప్రశ్నిస్తే కేసులు.. పోరాడితే అరెస్టులు ఉండేవని లోకేష్ మండిపడ్డారు.

అమరావతి: టీడీపీ కార్యకర్తల పోరాటంతో వైసీపీ (YSRCP) అడ్రస్ లేకుండా పోయిందని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఉద్ఘాటించారు. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోందని తెలిపారు. 94 శాతం స్ట్రైక్రేట్తో 164 సీట్లు గెలవడం ఆల్టైమ్ రికార్డ్ అని అభివర్ణించారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదిక నుంచి లోకేష్ ప్రసంగించారు. టీడీపీ కార్యకర్తల పోరాటంతోనే ఈ విజయం దక్కిందని కొనియాడారు. జెండా పీకేస్తామన్నవాళ్లు అడ్రస్ లేకుండా పోయారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
వై నాట్ 175 అన్నవారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సీబీఎన్ అంటే.. అభివృద్ధి, సంక్షేమం, మనందరి ధైర్యమని ఉద్ఘాటించారు. సీబీఎన్ అంటే.. పేదల చిరునవ్వు అని తెలిపారు. గతంలో ప్రశ్నిస్తే కేసులు.. పోరాడితే అరెస్టులు ఉండేవని చెప్పారు. తనపైనా 23 కేసులు పెట్టారు.. అయినా వెనక్కు తగ్గేదేలేదని అన్నారు. వైసీపీ హయాంలో జే బ్రాండ్ మద్యంతో 30 వేలమందిని చంపేశారని మండిపడ్డారు. నకిలీ మద్యంతో వేలకోట్లు లూటీ చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ఏర్పడిందని అన్నారు. అందరం జెండా, ఎజెండా పక్కన పెట్టి పనిచేశామని గుర్తుచేశారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ సాగుతున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
టీడీపీలో కార్యకర్తే అధినేత..
‘రానున్న జూన్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి టీచర్ల నియామకం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. టీడీపీలో కార్యకర్తే అధినేత. కోటిమందికి పైగా సభ్యత్వం పసుపు జెండా పవర్. కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం. పనిచేసే ప్రతి కార్యకర్తను ప్రోత్సహిస్తాం. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాయలసీమ డిక్లరేషన్కు నేను కట్టుబడి ఉన్నాను. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్లుగా మారుస్తున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ మన ఎజెండా. కూటమి ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. ప్రజలను జగన్ ఏనాడైనా కలిశారా. సామాన్యులకు ఇప్పటికీ తాడేపల్లి తలుపులు తెరుచుకోవు. 151 సీట్ల నుంచి 11కి ఎందుకు పడిపోయారో ఆలోచించుకోవాలి. అధికారంలో ఉన్నామన్న అహంకారం ఎప్పుడూ ఉండకూడదు.. ఎంత ఎత్తుకు ఎదిగినా నేలపైనే నిలబడాలి. తల్లి, చెల్లిని మెడపట్టి గెంటేసింది ఎవరు. బాబాయ్ను చంపేసిందెవరు. జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చిందెవరు. ఎర్ర బటన్ నొక్కి ప్రజలను బాదిందెవరు. రెడ్బుక్ రెడ్బుక్ అంటూ ఎందుకయ్యా ఏడుస్తున్నారు... రెడ్బుక్ చూసి వణికిపోతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారో.. వారి కోసమే రెడ్బుక్ అని చెప్పా. రెడ్బుక్ను చూసి ఒకరికి గుండెపోటు వచ్చింది.. మరొకరు బాత్రూమ్లో పడి చేయి విరగ్గొట్టుకున్నారు.. ఇంకో వ్యక్తి ఏమయ్యారో మీకందరికీ తెలుసు. ప్రభుత్వంలో సుస్థిరత ఉండాలి, అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుంది, గుజరాత్, ఒడిశా అలానే అభివృద్ధి చెందాయి’ అని లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..
వెన్నుపోటు రాజకీయాలు రావంటూ కవిత సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News