Home Minister Anitha: సజ్జల కనుసన్నల్లో మాత్రమే వైసీపీ ప్రభుత్వం నడిచింది
ABN , Publish Date - Jun 02 , 2025 | 10:24 AM
కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తాము పరదాలు కట్టుకుని దాక్కుని వెళ్లడంలేదని చెప్పారు. ప్రజలతో, ప్రజల మధ్య తిరుగుతున్నామని వివరించారు. తెనాలి ఘటనలో కులం, మతం ఎందుకు తెస్తున్నారని అనిత ప్రశ్నించారు.

విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) తెలిపారు. తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్ మెంట్పై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పులమటం ఏంటని నిలదీశారు. గత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే రెక్కలు విరిచి కొట్టారని మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత.
గతంలో సీఎం చంద్రబాబు అమరావతికి వెళ్తే రాళ్లు విసిరీ భావ స్వేచ్ఛ ప్రకటన అని అన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత గుర్తుచేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ అనలేదా అని నిలదీశారు. సజ్జలకు మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయంలో పోలీస్ శాఖ సీఎం , హోం మంత్రి చేతుల్లో లేదని.. సజ్జల కనుసన్నల్లో మాత్రమే గత జగన్ ప్రభుత్వం నడిచిందని ధ్వజమెత్తారు. తాము పోలీసులను చట్టపరంగా పని చేసే స్వేచ్చను ఇచ్చామని చెప్పారు. వైసీపీ నాయకులు సిగ్గులేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ(సోమవారం) విజయవాడలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్టేషన్ను హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. మోడల్ పోలీస్టేషన్గా సత్యనారాయణపురం పోలీస్టేషన్కు రికార్డు ఉందని ఉద్ఘాటించారు. ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్కు వచ్చిన అనుభూతి కలిగిందని తెలిపారు. 320 గజాల స్థలంలో రూ. 2 కోట్లతో నిర్మాణం చేశామని అన్నారు. ఏపీలో జిమ్ ఉన్న తొలి పోలీస్టేషన్ ఇదేనని చెప్పారు. మహిళలు, పిల్లలకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణం చేశామని వెల్లడించారు. సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలో రెండువందల కెమెరాలు పెట్టామని తెలిపారు. రౌడీ షీటర్ల కదలికల పై దృష్టి పెట్టి వారి ఫేస్ రికగ్నైజ్ పెట్టామని వివరించారు. సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను అరెస్టు చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి నేరం జరిగినా నేడు వెంటనే నిందితులను పోలీసులు పట్టుకుంటున్నారని చెప్పారు హోంమంత్రి వంగలపూడి అనిత.
ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, నేరస్థులను అరెస్టు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏపీలో ఇటీవల గంజాయి రవాణా చాలా వరకు తగ్గిందని చెప్పారు. ఒరిస్సా నుంచి కొంత రవాణా అవుతుందని... అది అరికడతామని అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేలో పోలీసులు భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. ప్రతిజిల్లాలో ఐదు వేల మంది పోలీసులు యోగాంధ్రలో పాల్గొంటారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు లేవు, హౌస్ అరెస్టులు లేవని స్పష్టం చేశారు. తాము పరదాలు కట్టుకుని దాక్కుని వెళ్లడంలేదని చెప్పారు. ప్రజలతో, ప్రజల మధ్య తిరుగుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపాధ్యాయుడు మందలించడం.. ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు
For More AP News and Telugu News