Bhupathi Raju Srinivas Verma: జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయి : శ్రీనివాస్ వర్మ
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:03 PM
జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. ఏపీకి తీరని నష్టం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.

పశ్చిమగోదావరి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై (YS Jaganmohan Reddy) కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ (Union Minister Bhupathi Raju Srinivas Verma) సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్వుతున్నాడో.. ఏడుస్తున్నాడో తెలియని ఒక అందమైన ఫొటోను కోడిగుడ్డు మీద గత జగన్ ప్రభుత్వంలో వేసుకున్నారని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్రమంత్రి భూపతిరాజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడారు.
వైసీపీ హయాంలో భారీగా దోపిడీ చేసి నిధులు దుర్వినియోగమయ్యేలా.. ప్రభుత్వ పథకాలను రూపకల్పన చేశారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. ప్రతి పనిలోనూ కోట్లాది రూపాయలను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. తల్లిని, చెల్లిని పట్టించుకోని వ్యక్తి జగన్.. ఆయన ఎలాంటి వారో ఏపీలోని ఆడపడుచులు గ్రహించి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.
యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి: మంత్రి పార్ధసారధి
ఏపీలో యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని మంత్రి పార్ధసారధి వ్యాఖ్యానించారు. ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇవాళ(ఆదివారం) నెల్లూరు నగరంలో యాదవ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మంత్రి కొలుసు పార్ధసారధి, ఎంపీ బీద మస్తాన్ రావు పాల్గొన్నారు. ఈ సదర్భంగా మంత్రి పార్ధసారధి మీడియాతో మాట్లాడారు. రూ.7లక్షల కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలని ఆహ్వానిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాలు చేస్తున్నారుని మంత్రి పార్ధసారధి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పండుగలా ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ
ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోంది..
For More AP News and Telugu News