Share News

Minister Seethakka: వారిని ఇబ్బందులు పెట్టొద్దు.. అధికారులకు మంత్రి సీతక్క క్లాస్

ABN , Publish Date - May 17 , 2025 | 04:14 PM

Minister Seethakka: దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని మంత్రి సీతక్క చెప్పారు. అందుకే నిబంధనల పేర ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు.

Minister Seethakka:  వారిని ఇబ్బందులు పెట్టొద్దు.. అధికారులకు మంత్రి సీతక్క క్లాస్
Minister Seethakka

హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ(శనివారం) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో నూతన రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెండింగ్ పనులు, పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ డాక్టర్ జి.అపర్ణ, ములుగు, మహబూబాబాద్ డీఎఫ్ఓలు, ఐటీడీఏ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


అటవీ చట్టాలు, అభయారణ్య చట్టాలకు లోబడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడులు, బడులు, ఆస్పత్రులు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్వోఎఫ్‌ఆర్ చట్టం అడ్డుకాదని మంత్రి సీతక్క గుర్తు చేశారు. అందుకే అటవీ అభయారణ్య చట్టాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ఏరియాల్లో దేవాదుల వంటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న ప్రజల అవసరం మేరకు రోడ్లు నిర్మించడంలో అభ్యంతరాలు ఎందుకని అటవీ శాఖ అధికారులను మంత్రి సీతక్క ప్రశ్నించారు.


దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని మంత్రి సీతక్క చెప్పారు. అందుకే నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు. అటవీశాఖ అధికారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఐటీడీఏ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కనీస రహదారి సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క సూచించారు.


మంత్రి సీతక్క ఆదేశాలతో కనీస రహదారుల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని అటవీ అధికారులు చెప్పారు. అటవీ, అభయారణ్య చట్టాలు నిబంధనలకు అనుగుణంగా రోడ్లు, కల్వర్టులు, లోకాజ్ వేల నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని పీసీసీఎఫ్, అటవీ శాఖ అధికారులు, డీఎఫ్‌ఓలు హామీ ఇచ్చారు. తారు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అటవీ అభయారణ్య చట్టాలు అంగీకరించని పక్షంలో పటిష్టంగా ఉండేలా గ్రావెల్, మట్టి రోడ్ల నిర్మాణాలను చేపడతామని అటవీశాఖ అధికారులు చెప్పారు. ములుగు నియోజకవర్గ ఏజెన్సీలో పెండింగ్ పనుల జాబితాను అటవీ శాఖ అధికారులకు అందించి.. ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ విభాగంతో చర్చించి పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

High Court: 132 కిలోల మత్తుపదార్థాల పట్టివేత కేసులో బెయిల్‌ ఇవ్వలేం: హైకోర్టు

Fake Cotton Seeds: 40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2025 | 04:18 PM