Raghunandan Rao: ఢిల్లీ బాంబు పేలుళ్లు.. వారిపై రఘునందన్ రావు ఫైర్
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:37 PM
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా, నవంబరు12 (ఆంధ్రజ్యోతి):: ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్ల ఘటనని పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి పలువురు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. అయితే పేలుళ్ల ఘటనలో ఎవరున్నా వదలబోమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 12 మంది చనిపోయారు. అయితే, ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో బీజేపీ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
ఇవాళ(బుధవారం)సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు 'సర్దార్ - ఏక్తా' పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడారు. బాంబు పేలుళ్లతో బీజేపీకీ ఏం సంబంధమని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలు వస్తే బ్లాస్టులు జరుగుతున్నాయని కొంతమంది సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ రఘునందన్ రావు.
ఇంతకంటే దేశద్రోహం ఇంకొక్కటి ఉండదని స్పష్టం చేశారు. పేలుళ్లకు కారణమైన వారి వెనుక బీజేపీ హస్తం ఉందని ఎవరైతే నీచంగా మాట్లాడుతున్నారో.. ఈ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని హితవు పలికారు. అలాంటి వ్యక్తులను ఎవరూ సమర్థించవద్దని సూచించారు. చేతిలో ఫోన్ ఉందని కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత.. భక్తుల ఆగ్రహం
Read Latest Telangana News And Telugu News