Telangana Local Body Elections: అందరి దృష్టి.. స్థానికంపైనే
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:35 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.

ముందుగా పరిషత్ పోరు నిర్వహిస్తారనే సంకేతాలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై
ఆర్డినెన్స్ వచ్చాక ప్రక్రియ
రిజర్వేషన్లు, అభివృద్ధి పనులు,
సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని భావిస్తున్న కాంగ్రెస్
గతంలో చేసిన పనులు,
ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్ఎస్ ఆశలు
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలపై
బీజేపీ ప్రత్యేక దృష్టి
పంచాయతీలు, పరిషత్లలో త్రిముఖ పోరు ఉండే అవకాశం
మహబూబ్నగర్, జూలై 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో (Telangana Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది.
అందులో భాగంగానే రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తమిళనాడు వంటి రాష్ర్టాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తుండటంతో ఇప్పుడు అదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అవలంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలుస్తుండగా, రేపో.. మాపో ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఇప్పటికే ఎన్నికలను పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వగా.. ఆలోపే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతానికి పంచాయతీలకంటే ముందు పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ఓటర్ జాబితా సిద్ధం కాగా.. కావాల్సిన బ్యాలెట్ బాక్సులు, సామగ్రి, ప్రింటింగ్ కూడా అధికారులు పూర్తిచేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు.
త్రిముఖ పోరు..
గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. మెజారిటీ స్థానాలను ఆ పార్టీనే దక్కించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పార్టీకి సింహభాగం స్థానాలు దక్కాయి. వేరే పార్టీల్లో గెలిచిన వారు సైతం అప్పట్లో బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది బీఆర్ఎ్సను వీడి కాంగ్రె్సలో చేరినప్పటికీ, ఇంకా బీఆర్ఎ్సలో తాజా మాజీ ప్రజాప్రతినిధుల శాతం అధికంగానే ఉంది. గ్రామాల్లో ఇంకా ఆ పార్టీ కేడర్ బలంగా ఉండగా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడర్ను బలోపేతం చేసుకోవడం వంటి పరిణామాలతో పోటీ హోరాహోరీగా ఉండనుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామనే అంశంతో కాంగ్రెస్ ముందుకు వెళ్లనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఇటీవలి కాలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎక్కువ సంఖ్యలో నిర్మించడం, సన్న బియ్యం పథకం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది.
అలాగే బీఆర్ఎస్ తమకున్న కేడర్, గతంలో చేసిన పనులు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తరచూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే పక్షంలో తమ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు గేట్వేగా ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం అనుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకుని.. సరైన అభ్యర్థులను నిలిపితే ఫలితం ఉంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పంచాయతీలను పార్టీ గుర్తుపై కాకుండా ఇతర గుర్తులపై గెలుచుకోవాల్సి ఉంటుంది. పరిషత్ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుగా పరిషత్ ఎన్నికలను నిర్వహించి, ప్రభుత్వ పనితీరుకు గెలుపు అని చెప్పాలని భావిస్తోంది.
గతంలో బీసీల గెలుపు శాతమిది..
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తుండగా.. గతంలో రిజర్వేషన్లు తక్కువగా ఉన్న సమయంలోనూ బీసీలు జనరల్ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. ఒకవేళ బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వలేని పక్షంలో పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ గతంలో భావించింది. దానిపై కొంత విమర్శలు రావడంతో ఎలాగైనా చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసింది. దాంతో ఆశావహులు పల్లెల్లో ముమ్మరంగా తిరుగుతున్నారు.
1,686 గ్రామ పంచాయతీలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,686 పంచాయతీలు, 800 ఎంపీటీసీ, 77 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. గతంలో వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 268కి చేరింది. ఏదుల నూతన మండలం ఏర్పాటు కావడంతో నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలను ఏదుల మండలంలో విలీనం చేశారు. అలాగే ఏదుల జడ్పీటీసీ స్థానం కూడా కొత్త మండల ఏర్పాటుతో పెరిగింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో కూడా కొత్తగా ఎర్రవల్లి జడ్పీటీసీ స్థానం పెరిగింది. నారాయణపేట జిల్లాలో కొత్తపల్లి, గుండుమాల్ జడ్పీటీసీ స్థానాలు కొత్తగా అయ్యాయి. కొత్త మండలాలు, పంచాయతీలకు అనుగుణంగా ఓటర్ జాబితాను సిద్ధం చేశారు. కొన్ని కొత్తగా మునిసిపాలిటీలుగా ఏర్పడగా.. వాటి పరిధిలోకి కొన్ని పంచాయతీలను విలీనం చేయనున్నారు. వాటికి మునిసిపాలిటీలతో పాటే ఎన్నికలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..
44 ఏళ్ల కెరీర్లో నేను నేర్చుకున్నది ఇదే.. అనుభవాలను పంచుకున్న ఆనంద్ మహీంద్రా
Read latest Telangana News And Telugu News