Share News

CM Revanth Reddy: గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - May 19 , 2025 | 03:29 PM

CM Revanth Reddy: పోడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆరోపించారు. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అని గుర్తుచేశారు. అచ్చంపేటలో ప్రతి రైతుకూ సోలార్‌ విద్యుత్‌ అందించి తీరుతామని సీఎం రేవంత్‌‌ రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth Reddy: గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

నాగర్ కర్నూల్: అభివృద్ధిలో పాలమూరు ఎంతో వెనకబడిందని.. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామని.. మీరు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా ఉన్నాయని ఉద్ఘాటించారు. నల్లమల అంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతమని, ఎవరో వచ్చి నల్లమలను అభివృద్ధి చేయాలని అనేవారే కానీ అభివృద్ధి చేయలేదని చెప్పారు. ఇవాళ(సోమవారం) నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించారు.


రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనుల సమగ్రాభివృద్ధికి రూపొందించిన 10 అంశాలతో నల్లమల డిక్లరేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి , మంత్రులు ఆవిష్కరించారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు రూ.119 కోట్ల రుణాలు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. పాలమూరు, నల్లమల ప్రాంత వాసినని తాను గర్వంగా చెప్పుకుంటానని ముఖ్యమంత్రి అన్నారు. పోడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అని గుర్తు చేశారు. అచ్చంపేటలో ప్రతి రైతుకూ సోలార్‌ విద్యుత్‌ అందించి తీరుతామని స్పష్టం చేశారు. సోలార్‌ విద్యుత్‌తో ఆదాయం వచ్చేలా చేస్తామని తెలిపారు. తెలంగాణలో కోటి 35 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి సాధించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.


పండిన సన్నబియ్యం ప్రతి పేదవాడికీ అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చెప్పుకొచ్చారు. 50 లక్షల పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టామని, మహిళా సంఘాలను పెట్రోల్‌ బంక్‌లకు యజమానులను చేశామని అన్నారు. హైటెక్‌ సిటీలో తమ ఉత్పత్తులు అమ్ముకునేలా 3 ఎకరాలు కేటాయించామని పేర్కొన్నారు. మహిళలే ఆర్టీసీ బస్‌లు అద్దెకు తిప్పుకునేలా చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.


దేశంలో తెలంగాణ నంబర్ వన్..

‘అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఎంత బాధ్యత ఉందో.. ఈ ప్రాంత బిడ్డగా నాకూ అంతే ఉంది. ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేశారు. ఇప్పుడు త్వరగా నోటిఫికేషన్‌లు ఇవ్వవద్దని నిరుద్యోగులు కోరుతున్నారు. నిత్యావసర సరకుల ధరలు పెరగకుండా నియంత్రించడంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్. శాంతి భద్రతల విషయంలో దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో దేశంలో నంబర్ వన్. పాలమూరు బిడ్డలకు పరిపాలన చేతకాదని అన్న వారికి.. మనం నంబర్ వన్‌లో ఉండి గట్టి సమాధానం చెప్పాం. ఇదే సరిపోదు.. ఇంకా అభివృద్ధి పనులు చేయాలి. 54 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌తో యుద్ధం చేసి.. ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత ఇందిరమ్మది. ఇప్పటికీ ప్రతీ ఇంటిలో ఇందిరమ్మ అంటే అభిమానం. ఇందిరమ్మ పేరుతోనే ఈ పథకం తెచ్చాం. నల్లమల డిక్లరేషన్‌లో భాగంగా తండాలు, గూడాల్లో ఆరు లక్షల ఎకరాల్లో సోలార్ విద్యుత్ ద్వారా పంటలు పండించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతాం. మాకు మీ అండ ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న విమర్శలు మాకు లెక్క కాదు. వారిని నేను పట్టించుకోను’ అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్‌ కనెక్షన్లు.!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 19 , 2025 | 04:06 PM