Telangana formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 09:46 AM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానిమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవశ్యకత గురించి నేతలు వివరించారు.

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana State Formation Day Celebrations) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పురోగతికి లెక్కలేనంత కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని అభివర్ణించారు. గత దశాబ్దంలో, రాష్ట్ర ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు విజయం, శ్రేయస్సుతో ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజలు అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక , సాంకేతిక అభివృద్ధి శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని ద్రౌపది ముర్ము కోరారు.
తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలి: సీఎం చంద్రబాబు
తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Nara Chandrababu Naidu) ఉద్ఘాటించారు. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే తన ఆలోచన, ఆకాంక్ష అని తెలిపారు. 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్ భారత్-2047 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని, తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని.. ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలంగాణ నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపింది: పవన్ కల్యాణ్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ‘జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాల్లో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి
జీహెచ్ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
Read Latest Telangana News And Telugu News