CM Revanth Reddy: సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 10:14 AM
సౌదీ అరేబియా ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టోల్ ఫ్రీ నెబర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సౌదీ అరేబియా (Saudi Arabia)లో ఇవాళ(సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. బస్సు - ట్యాంకర్ ఢీకొన్న ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది. బదర్ - మదీనా మధ్య ముఫరహత్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువమంది తెలంగాణ (Telangana)వారు ఉన్నారు. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సీఎం వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయని.. ఈ ఘటనలో హైదరాబాద్ (Hyderabad) వాసులు కూడా ఉన్నారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు సీఎం రేవంత్రెడ్డి.
ఈ ఘటనలో తెలంగాణ (Telangana)కు చెందిన వారు ఎంతమంది ఉన్నారో వెంటనే తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని కోరారు సీఎస్ రామకృష్ణారావు.
సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు తగిన సమాచారాన్ని, సహాయ సహాకారాలు అందించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం +91 79979 59754, +91 99129 19545 ఈ నెంబర్లలో సంప్రదించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
సౌదీ అరేబియా ఘటనపై జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి...
సౌదీ అరేబియాలోని మదీనాలో భారతీయ పౌరులకు జరిగిన ప్రమాదంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు జై శంకర్. రియాద్లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఈ ప్రమాదంలో ప్రభావితమైన భారతీయ పౌరులు, కుటుంబాలకు పూర్తి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని జై శంకర్ ప్రార్థించారు.
సౌదీలో బస్సు ప్రమాదం బాధాకరం: బండి సంజయ్
సౌదీ అరేబియాలోని మదీనాలో భారతీయ పౌరులకు జరిగిన ప్రమాదంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీలో బస్సు ప్రమాదం బాధాకరమని తెలిపారు. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు ఉన్నారని తెలుస్తోందని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారని వివరించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు.
గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలి: కేసీఆర్
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు తెలంగాణ వాసులు మరణించడంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హజ్ యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళ్తున్న బస్సు అగ్నిప్రమాదానికి గురై అందులో ప్రయాణిస్తున్న పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేసీఆర్.
సౌదీ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి: అసదుద్దీన్ ఓవైసీ
సౌదీ అరేబియాలోని మదీనాలో భారతీయ పౌరులకు జరిగిన ప్రమాదంపై ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు అసదుద్దీన్ ఓవైసీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ ప్రార్థించారు.
సౌదీ ఘటనపై వెంటనే అప్రమత్తం అయ్యాం: సీపీ సజ్జనార్
సౌదీ అరేబియాలోని మదీనాలో భారతీయ పౌరులకు జరిగిన ప్రమాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మక్కాకి వెళ్లిన వారు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, డీజీపీ శివధర్ రెడ్డి వెంటనే బాధితుల వివరాలు సేకరించాలని తమను ఆదేశించారని తెలిపారు. ఈ ఘటనపై తాము అప్రమత్తమై అక్కడ అధికారులతో మాట్లాడామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
సహాయక చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారనే సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలోని ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, వైస్ చైర్మన్ భీమ్రెడ్డిలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎన్నారై కమిటీతో సమన్వయం చేసుకుంటూ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
సౌదీ ఘటనపై మంత్రి సీతక్క విచారం..
సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడంపై తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో మృతుల్లో హైదరాబాద్కు చెందిన వారు ఉన్నారన్న వార్త మరింత దు:ఖాన్ని కలిగిస్తుందని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని మంత్రి సీతక్క ప్రార్థించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..
షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లు బంద్..
Read Latest Telangana News and National News