Bofors Case: కుంభకోణం రూ.64 కోట్లు.. దర్యాప్తుకు రూ.250 కోట్లు.. మళ్లీ వార్తల్లోకి బోఫోర్స్ కేసు..
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:09 PM
Bofors Case CBI Request : దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన బోఫోర్స్ కుంభకోణం కేసును (Bofors Scam) మళ్లీ తెరపైకి తెచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI). చిత్రా సుబ్రమణ్యం రాసిన కొత్త పుస్తకం బోఫోర్స్ గేట్ ఆధారంగా అమెరికాను ఈ విషయంలో సీబీఐ..

Bofors Case CBI Request : బోఫోర్స్ ముడుపుల కుంభకోణం దర్యాప్తు పునఃప్రారంభించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. బోఫోర్స్ లంచం కుంభకోణం దర్యాప్తులో ఇది కొత్త మలుపు కానుంది. ఈ కుంభకోణంలో కీలక సమాచారం సేకరించేందుకు సీబీఐ అమెరికన్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైఖేల్ హెర్ష్మన్ను గతంలోనే అభ్యర్థించగా అతడు సానుకూలంగా స్పందించాడు. అనంతరం దీనికి సంబంధించి సీబీఐ అమెరికా అధికారులకు పలుమార్లు లేఖలు పంపినా స్పందన రాలేదు. తాజాగా, మైఖేల్ హెర్ష్మన్ నుంచి సాక్ష్యం సేకరించేందుకు కీలక ముందడుగు పడింది. ఇటీవల భారత హోంశాఖ నుంచి అమెరికా(USA)కు న్యాయపరమైన అభ్యర్థన లేఖ (లెటర్ రొటేటరీ) పంపేందుకు సీబీఐకి అనుమతి లభించింది.
1980ల నాటి బోఫోర్స్ కుంభకోణం అప్పట్లో దేశంలో అతిపెద్ద సంచలనం. తరచూ దేశ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. 39 సంవత్సరాల క్రితం జరిగిన ఈ దర్యాప్తు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతూనే ఉంది. అయితే, తాజాగా ఈ కేసు మళ్లీ వార్తల్లోకెక్కింది. 2017లో ఫెయిర్ఫాక్స్ గ్రూప్ చీఫ్ మైఖేల్ హెర్ష్మన్ భారతదేశాన్ని సందర్శించినపుడు బోఫోర్స్ కుంభకోణంపై కీలక సమాచారం వెల్లడించారు. విదేశాల్లోని భారతీయులు కరెన్సీ నియంత్రణ చట్టాలను ఉల్లంఘించడంతో.. మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేయడానికి 1986లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తనను నియమించిందని మైఖేల్ హెర్ష్మన్ పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఈ కుంభకోణం దర్యాప్తును పక్కదారి పట్టించిందని.. బోఫోర్స్ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సీబీఐతో పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మైఖేల్ హెర్ష్మన్ ఆరోపణల ఆధారంగా సీబీఐ తిరిగి ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.
దేశ రాజకీయాల్లో కలకలం రేపిన బోఫోర్స్..
బోఫోర్స్ కుంభకోణం 1980లలో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ కుంభకోణం బయటపడిన తర్వాత రాజకీయంగా తీవ్ర కలకలం చెలరేగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వీడిష్ కంపెనీ బోఫోర్స్తో 400 155 ఎం.ఎం. హోవిట్జర్ తుపాకుల కోసం రూ.1,437 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో రూ.64 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కుంభకోణం రూ.64 కోట్లు అయితే దర్యాప్తుకే రూ.250 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. అయినా, ఈ కేసులో లంచాలు చెల్లించినట్లు నిరూపించలేకపోవడంతో.. 2004లో ఢిల్లీ హైకోర్టు తన తీర్పులలో ఒకదానిలో బోఫోర్స్ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఒప్పందంలో మధ్యవర్తి ఒట్టావియో క్వాట్రోచీని కూడా 2011లో కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. 2018లో సీబీఐ ఈ తీర్పులను సుప్రీంలో సవాల్ చేయగా తిరస్కరించింది. కాగా, అజయ్ అగర్వాల్ అనే న్యాయవాది 2005లో వేసిన పిటిషన్పై దర్యాప్తు సాగుతూ ఉంది.
Read Also : హీరో విశాల్ ప్రశ్న.. విజయ్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..
హీరో విజయ్ది పగటికలే.. అందరూ ఎంజీఆర్ కాలేరు
అమౌంట్ స్థానంలో అకౌంట్ నంబర్.. కస్టమర్ ఖాతాలోకి రూ. 52,314 కోట్లు