BJP Next National President: బీజేపీకి మహిళా అధ్యక్షురాలు.. రేసులో ఉంది వీరే
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:36 PM
BJP Next National President: బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నాడు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ సమావేశం మొదలైంది. బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ, జులై 4: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి (BJP Nationa Chief) ఈసారి మహిళను వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు (శుక్రవారం) నుంచి ఢిల్లీలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ సమావేశంలో బీజేపీ అధ్యక్ష పదవిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ మహిళా అధ్యక్షురాలిగా నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, మహిళా అధ్యక్షురాలి రేసులో నిర్మలతో పాటు పురందేశ్వరి (Purandeswari), వనతి శ్రీనివాసన్ల (Vanthi Srinivasan) పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల జేపీ నడ్డా, బీఎల్ సంతోష్తో నిర్మలా సీతారామన్ భేటీ అయిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా.. ఈసారి బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు అవకాశం ఇస్తే బాగుంటుందని బీజేపీలో కొందరు నేతల మాట. ఈ క్రమంలో ఎవరిని బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ అధ్యక్షురాలి రేసులో ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నిర్మల పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మలతో పాటు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలో ఉన్నట్లు సమాచారం. నిర్మల పేరు ఖరారు కానీ పక్షంలో బీజేపీ అధ్యక్ష పదవిని ఈసారి దక్షిణాదికి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దక్షిణాదికి చెందిన పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు ఖరారయ్యే ఛాన్స్ ఉంది.
కమల్ హాసన్ను ఓడించి..
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కోయంబత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వనతి శ్రీనివాసన్ గెలుపొందారు. కమల్ హాసన్ను ఓడించి మరీ వనతి ఎమ్మెల్యే అయ్యారు. 2020లో బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలిగా ఆమె నియమితులయ్యారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా కూడా నియమితులయ్యారు. అనేక బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించిన నేపథ్యంలో వనతి శ్రీనివాసన్ కూడా బీజేపీ అధ్యక్ష పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బహుభాషా నాయకురాలు పురందేశ్వరి
ఇక పురందేశ్వరికి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బహుభాషా నాయకురాలు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ తర్వాత విదేశాలకు వెళ్లి ఉగ్రవాదంపై భారతదేశం వైఖరిని చెప్పే ప్రతినిధి బృందాల్లో పురందేశ్వరి కూడా భారత్ తరఫున గళం వినిపించేందుకు విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఈసారి వీరి ముగ్గురిలో ఒకరికి బీజేపీ అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
సిగాచి ఘటన.. మరొకరు మృతి.. ప్రమాద స్థలికి హైలెవల్ కమిటీ
తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం స్టార్ట్.. ప్రధానంగా వాటిపైనే చర్చ
Read latest National News And Telugu News