Share News

JD Vance: నేరస్థులను పట్టుకునేందుకు భారత్‌కు పాక్ సహకరించాలి: జేడీ వాన్స్..

ABN , Publish Date - May 02 , 2025 | 10:14 AM

JD Vance: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరు దేశాలకు కీలక సూచన చేశారు.

JD Vance: నేరస్థులను పట్టుకునేందుకు భారత్‌కు పాక్ సహకరించాలి: జేడీ వాన్స్..
JD Vance on Pehalgam Attack

JD Vance India Pakistan Relations: పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను దారుణంగా హతమార్చడంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యుద్ధం వచ్చే అవకాశముందనే వార్తలు అంతటా వ్యాపిస్తున్నాయి. ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇరు దేశాలకూ కీలక సూచన చేశారు. దాడికి ప్రతీకారంగా భారతదేశం ప్రాంతీయ సంఘర్షణలకు దిగకుండా ఉండేందుకు ప్రయత్నించాలని కోరారు. పాకిస్థాన్ కూడా బాధ్యత తీసుకుని ఉగ్రవేటలో ఇండియాకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడుతూ, "ఈ ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయని విధంగా స్పందించాలని కోరుతున్నాము. స్పష్టంగా చెప్పాలంటే, పాకిస్థాన్ బాధ్యత వహించేంతవరకు. ఇక పాక్ కూడా వారి భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులను వేటాడేందుకు భారతదేశానికి సహకరిస్తుందని ఆశిస్తున్నాము" అని అన్నారు. గత నెలలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. భారత ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందని, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేసేందుకు సిద్ధమని అన్నారు.


గతనెల ఏప్రిల్ 22న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలోనే పహల్గాంలో ఘాతుకానికి తెగబడ్డారు ఉగ్రవాదులు. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వచ్చిన పర్యాటకులను అమానుషంగా కాల్చి చంపి రాక్షసానందం పొందారు. ఈ ఘోర విషాదం యావత్ ప్రపంచాన్నే కుదిపేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలు దేశాధినేతలు బైసరన్ లోయలో ఉగ్రవాదుల అమానుష చర్యలను తీవ్రంగా ఖండిస్తూ భారత్ కు తమ మద్ధతు ప్రకటించారు.


పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగిన నాటి నుంచి భారత్ వరసగా దాయాది దేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకెళ్తోంది. దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేసింది. వాయు మార్గాలు మూసివేయడంతో పాటు పాకిస్థాన్ జాతీయులందరినీ వెనక్కి పంపేసింది. దౌత్యపరంగానూ కఠిన చర్యలు చేపట్టి దాయాది దేశం కంటిలో నలుసులా మారింది. ఇప్పటికే ఈ దాడికి మూలాలు పాకిస్థాన్ లో ఉన్నట్లు భారత్ నిఘా వర్గాలు సాక్ష్యాధారాలు సేకరించాయి. పహల్గాం విషాదానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలను మొదలెట్టాయి. దాడి చేసినవారిపైనా, చేయించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకునేవరకూ విరమించబోమని ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


Read Also: Mark Zuckerberg: మెటా కోడింగ్‌ అంతా ఏఐతోనే

Fast Foods: ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటే అకాల మృత్యువే.. జాగ్రత్త'

Bilawal Bhutto: భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకున్న భుట్టో

Updated Date - May 02 , 2025 | 11:29 AM