Share News

CM Chandrababu: నా వద్ద...మీ రౌడీయిజం చెల్లదు.. వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jun 16 , 2025 | 09:35 PM

విశాఖను టూరిజం హబ్‌గా, ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలలు తెరిచే లోపు...తల్లికి వందనం ఇస్తామని చెప్పామని అలాగే మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

CM Chandrababu: నా వద్ద...మీ రౌడీయిజం చెల్లదు.. వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
AP CM Chandrababu Naidu

విశాఖపట్నం: వైసీపీ నేతలు (YSRCP Leaders) పులివెందుల తరహా రాజకీయాలు చేస్తే.. తోక కట్ చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) హెచ్చరించారు. విశాఖపట్నంలో వైసీపీ నేతలు భూములు కొట్టేశారని ఆరోపించారు. ఎవరైనా భూముల జోలికి వస్తే...వెన్నులో భయం వచ్చేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గత జగన్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని గుర్తుచేశారు. వైసీపీ నేతల మాటలను విశాఖ వాసులు నమ్మలేదని.. మొన్నటి ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఘోరంగా ఓడించారని చెప్పారు. విశాఖకు కూటమి ప్రభుత్వం రుణపడి ఉందని...ఎంత చేసిన తక్కువే అనిపిస్తోందని అన్నారు. ముంబైకి ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

TDP-4.jpg


నేను మెచ్చిన నగరం విశాఖపట్నం

రాష్ట్రం అంతా ఒక ఎత్తు...విశాఖ ఒక ఎత్తు అని సీఎం చంద్రబాబు తెలిపారు. తాను మెచ్చిన నగరం విశాఖపట్నం... మంచి వాళ్లు ఎక్కువగా ఉన్న నగరం ఇదని అభివర్ణించారు. కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీనేనని ఉద్ఘాటించారు. ఎత్తిన జెండా దించకుండా.. ఎంతోమంది కార్యకర్తలు గత జగన్ ప్రభుత్వ అరాచకాలపై పోరాటం చేశారని ప్రశంసించారు. మనది రాజకీయ బంధం కాదు.. కుటుంబ బంధం..కార్యకర్తల గౌరవాన్ని పెంపొందిస్తానని మాటిచ్చారు. టీడీపీ కార్యకర్తలు చాలా పవర్‌పుల్‌గా ఉంటారని మెచ్చుకున్నారు. కార్యకర్తలకు అలక వస్తే.. కాడి వదిలేస్తారు..కానీ ఏ పార్టీలోకి వెళ్లరని కొనియాడారు సీఎం చంద్రబాబు.

TDP-1.jpg


ఢిల్లీలో మన పరపతి పెరిగింది..

టీడీపీ కార్యకర్తలు అలిగే పరిస్థితిని తాను ఎప్పుడూ రానివ్వనని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చామని గుర్తుచేశారు. మన మీద నమ్మకంతో కూటమికి భారీ మెజార్టీ ఇచ్చారని.. దీంతో ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగిందని చెప్పారు. విశాఖపట్నం ఉమ్మడి జిల్లా టీడీపీ కార్యకర్తలు అందరూ సమీక్షకు వచ్చారని అన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువగా రావడానికి కారణం టీడీపీనేనని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సిద్ధం అవుతోందని..త్వరలోనే విశాఖకు మెట్రో వస్తుందని ప్రకటించారు. గూగుల్ డేటా హబ్‌గా విశాఖ కానుందని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తోందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వమేనని... ఇటీవల ఆర్థిక ప్యాకేజీ కూడా వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

TDP-3.jpg


అభివృద్ధిలో రాజీపడను...

‘విశాఖపై అభిమానంతో ఎన్నో చేస్తున్నాం...అభివృద్ధిలో రాజీ పడను. రైల్వే‌జోన్‌కి భూమి కేటాయించాం.. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో గతంలో అమరావతికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి...మూడు రాజధానులు అన్నారు. అమరావతిని స్మశానంతో పోల్చారు. విశాఖను టూరిజం హబ్‌గా చేస్తాం. ఆకాశమే హద్దుగా విశాఖను అభివృద్ధి చేస్తాం. పాఠశాలలు తెరిచే లోపు...తల్లికి వందనం ఇస్తామని చెప్పాం.. మాట నిలబెట్టుకున్నాం. ఎంతమంది పిల్లలు ఉన్నా.. తల్లికి వందనం ఇచ్చాం. ఈ విషయాన్ని కాలర్ ఎత్తుకొని టీడీపీ కార్యకర్తలు చాటి చెప్పాలి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా ఏపీ లాంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు లేవు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. వైసీపీ హయాంలో ఒక టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దీపం పథకాన్ని నేనే ప్రారంభించాను. ఇప్పుడు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్‌లు ఇస్తున్నాం. రోడ్డు మీద గుంత లేకుండా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తాం. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం రూ.21 వేలు ఇస్తాం. రాష్ట్రంలో ఉన్న భూతాన్ని రాజకీయ సమాధి చేశాం. 2019 ఎన్నికల ముందు నన్ను మోసం చేశారు’ అని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP.jpg


జగన్ మీడియాలో అసత్య ప్రచారం..

‘జగన్ మీడియాలో తన బాబాయ్‌‌(వివేకారెడ్డి)కి గుండెపోటని అసత్య ప్రచారం చేశారు. ఆ రోజు నేను దోషులను జైల్లో పెట్టి ఉంటే...మనం అప్పుడు ఓడిపోయే వాళ్లం కాదు. బాబాయ్ హత్యపై... నాటకాల రాయుడు నాటకాలు ఆడాడు. కోడి కత్తి, గులక రాయి డ్రామాలు ఆడారు. మొన్నే ఆయన ఇంటి దగ్గర అగ్నిప్రమాదం డ్రామా ఆడారు. పొదలిలోకి వెళ్లాడు.. అక్కడ రైతులను రెచ్చగొట్టారు. ఎదురొస్తే...తొక్కిస్తామని ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు. నా వద్ద...మీ రౌడీయిజం చెల్లదు.. నేను ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తాను. గంజాయి , డ్రగ్స్‌కి రాష్ట్రంలో చోటు లేదు. రౌడీలకు వత్తాసు పలికితే కఠిన చర్యలు. నేను రాజకీయ పోరాటం చేశాను.. నాకు ఎవరి మీద కక్ష లేదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం.. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదు. వాట్సాప్ గవర్నెన్స్‌కి శ్రీకారం చుట్టాం. ఏపీ రోడ్లను బ్రహ్మాండంగా తయారు చేసే బాధ్యత నాది. విశాఖలో పోర్టు, ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తాం. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. ఇంకా టైమ్ ఉంది..యోగా ప్రాక్టీస్ చేయండి.. 5 లక్షల మందికి టీ షర్ట్స్ ఇస్తున్నాం. మొన్నటి ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటు సాధించాం. 2029 ఎన్నికల్లో మళ్లీ మనం ఘన విజయం సాధించాలి’ అని సీఎం చంద్రబాబు కోరుకున్నారు.

TDP-2.jpg


ఇవి కూడా చదవండి

షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 10:02 PM