Minister Narayana: జగన్ డైరెక్షన్స్తోనే ఇలా మాట్లాడుతున్నారు.. మంత్రి నారాయణ ఫైర్
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:41 AM
జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.

నెల్లూరు: అమరావతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి నారాయణ (Minister Narayana) ఆరోపించారు. కావాలనే అమరావతికి నష్టం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రతిరోజూ ఇచ్చే డైరెక్షన్స్తోనే కింద ఉండేవారు అమరావతి గురించి దారుణంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని అన్నారు మంత్రి నారాయణ.
ఎవరు చెప్పారో, ఎవరు చేయిస్తున్నారో అందరిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి నారాయణ హెచ్చరించారు. జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని విమర్శించారు. రాజధాని అమరావతికి 30వేల ఎకరాలు కావాలని గతంలో అన్నారని.. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు కావాలని చెప్పారని అదీ చేయలేదని మండిపడ్డారు. అమరావతికి సీఆర్డీఏ రూ.64వేల కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. రూ.54వేల కోట్లతో రాజధాని అమరావతిలో వేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
నెల్లూరులో మంత్రి నారాయణ ఇవాళ(సోమవారం) పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. నెల్లూరు నగరంలో మురుగునీటి పారుదల కాలువల్లో పూడికలతీత పనులని మంత్రి నారాయణ పరిశీలించారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో కాల్వల్లో పూడిక తీసిన పాపాన పోలేదని మండిపడ్డారు మంత్రి నారాయణ.
ఏపీవ్యాప్తంగా 123 మున్సిపాల్టీల్లో రూ.50కోట్లతో పూడికతీత పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ వివరించారు. రూ.13000కోట్లతో ఇంటింటికీ మినరల్ వాటర్ ఇస్తామని చెప్పారు. ఇందులో భాగంగా తాగునీటి నళ్లాల ఏర్పాటుకి టెండర్లు పిలువబోతున్నామని అన్నారు. గత జగన్ ప్రభుత్వం ఏపీపై రూ.10లక్షల కోట్ల అప్పులతో పాటు, 85లక్షల టన్నుల చెత్తని మిగిల్చివెళ్లిందని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి చెత్తనంతా తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. వీఆర్ స్కూల్ తరహాలో మరో నాలుగు స్కూళ్లని ఏర్పాటు చేసేందుకు నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే..
హమీల అమలుకు బాబు సర్కార్ వ్యూహరచన
For More AP News and Telugu News