Share News

Minister Kollu Ravindra: పేర్ని నాని.. అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు

ABN , Publish Date - Jun 13 , 2025 | 02:01 PM

ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్‌లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.

Minister Kollu Ravindra: పేర్ని నాని.. అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
Minister Kollu Ravindra

కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) నకిలీ పట్టాల వ్యవహారంపై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) షాకింగ్ కామెంట్స్ చేశారు. పేర్ని నానికి మతిభ్రమించిందని ఆరోపించారు. అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి నేతలను ఎందరినో చరిత్రలో చూశామని.. అవాకులు చవాకులు పేలిన చాలమంది నేతలు కాలగర్భంలో కలిసిపోయారని ఆక్షేపించారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బురదజల్లే కార్యక్రమాలకు పేర్ని నాని పాల్పడుతున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో తన కొడుకుని గెలిపిచుకోవడం కోసం పడరానిపాట్లు పడి, చేయరాని తప్పులు చేశారని ఎద్దేవా చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.


దొంగ పట్టాలు సృష్టించావ్...

దొంగ పట్టాలు సృష్టించి అమాయక పేద ప్రజలకు పంచి పెట్టి మోసం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఆ నాడు తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి పూట దొంగ పట్టాలు తయారు చేయడాన్ని తాము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని అన్నారు. స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారని మండిపడ్డారు. నాడు పేర్ని నాని ఇచ్చిన దొంగ పట్టాలపై విచారణ జరుగుతుంటే గజ గజ వణికిపోతున్నాడని సెటైర్లు గుప్పించారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ పారిపోయి హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటీషన్లు వేశారని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర.


ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్‌గా సునీల్ ఉన్నారని చెబుతున్నావ్.. ఎక్కడ ఉన్నారో చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. కోడ్ వచ్చిన సమయంలో సునీల్ అనపర్తిలో ఉన్నారని గుర్తుచేశారు. పేర్ని నానికి ఆయన భార్య మీద అంత ప్రేమ ఉంటే పేదల బియ్యం బొక్కేవారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పేర్ని నాని గోడౌన్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్లిన ప్రతి లారీ సీసీ ఫుటేజ్ టోల్ గేట్ల దగ్గర సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని తెలిపారు. న్యాయాధికారి ఆదేశాలతోనే పేర్ని నాని భార్యను విచారించారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


పేర్నినానిని బఫూన్‌లా చూస్తున్నారు..

‘ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్‌లా చూస్తున్నారు. నీలాంటి వాళ్లు రాజకీయాల్లో అనర్హులు.. నీపై అనర్హత వేటు వేయాలి. గతంలో 6400 టిడ్కో ఇళ్లు కడితే పేదలు ఇవ్వడానికి మీకెందుకు మనసు రాలేదు.. ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని కమీషన్లకు పాల్పడ్డాడు. గ్రామాల్లో స్మశానాలను సైతం కాజేశారు. మెడికల్ కాలేజ్ భూముల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని కాగ్ మొట్టికాయలు వేయడం నిజం కాదా..? గిలకలదిండిలో సీఆర్జెడ్ భూములిస్తే పట్టాలు రావని ఆ నాడు మేము పోరాడం. కలెక్టర్‌ని నకిలీ పట్టాల విషయంలో కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చావ్.. ఆ నాడు నేను పోరాట ఫలితంగానే నువ్వు అక్కడి పేదలకు భూములు కొని ఇచ్చారు.. ఆ భూముల కొనుగోళ్లలోనూ కమిషన్లు కొట్టుకున్నారు. బందరుకోటలో గతంలో నువ్వు ఇచ్చిన దేవనబోయిన రాము భూములకు ఇప్పటికీ పట్టాలు రాని పరిస్థితి.. బందరు పోర్టును నేనే కట్టా.. నేనే కట్టా అంటున్నావ్..నాడు మేం చేసిన ఉద్యమ ఫలితమే బందర్ పోర్టు. 2006లో బందర్ పోర్టును రాజశేఖరరెడ్డి గోగులేరుకు తరలిస్తే నాకు అభ్యంతరం లేదని సంతకం పెట్టిన వ్యక్తివి నువ్వు.. ఆ తర్వాత మేం చేసిన ప్రజా ఉద్యమానికి దిగి వచ్చి మా అమ్మ మీద ఒట్టు.. పెదపట్నంలోనే పోర్టు అన్న వ్యక్తివి కూడా నువ్వే.. 2014 ఎన్నికల్లో పోర్టు పనులు ప్రారంభించకపోతే కోనేరుసెంటర్‌లో మోకాళ్లపై నిలబడి ముక్కును నేలకు రాసి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న వ్యక్తి నువ్వు కాదా’ అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నల వర్షం కురిపించారు.


భూముల సేకరణలో ఇబ్బందులు పెట్టావ్..

‘గత టీడీపీ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పర్చేజింగ్, భూసేకరణ పాలసీల కింద భూములు సేకరించాం. భూముల సేకరణలో అనేక ఇబ్బందులు పెట్టావ్. రెండుసార్లు జగన్‌ని తీసుకొచ్చి భూములు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశావ్.. వీటన్నింటినీ అధిగమించి గత టీడీపీ ప్రభుత్వంలో పోర్టు పనులు ప్రారంభిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన మీరు ఆ పనులు ఆపివేశారు. గతంలో బాలశౌరి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కొంత నిధులు తెస్తే ఎన్నికల ముందు పోర్టు పనులు ప్రారంభించారు. నేడు ఆ పనులను 67శాతం మేం పూర్తి చేశాం. 2026 జూన్ తర్వాత పోర్టును ఆపరేషన్‌లోకి తీసుకువస్తాం. ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను బెదిరించాలని చూస్తే సహించేది లేదు. అధికారులపై అభియోగాలు మోపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మసులా బీచ్ ఫెస్టివల్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.. మంగినపూడి బీచ్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు బీచ్ ఫెస్టివల్ నిర్వహించాం. మచిలీపట్నం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం’ అని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇద్దరి ప్రాణం తీసిన విష వాయువు

జూలై 15 నుంచి లెక్చరర్‌ పోస్టులకు పరీక్షలు

Read latest AP News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 02:12 PM