విజయవాడ: ఇంద్రకీలాద్రిలో జులై 25 నుంచి శ్రావణ మాసోత్సవాలు..
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:51 PM
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసం పూర్తయ్యేవరకూ ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై త్వరలో శ్రావణ మాస సందడి మొదలుకానుంది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నెలరోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాదిలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు.
జులై 25 నుంచి శ్రావణ మాసోత్సవాలు..
ఇంద్రకీలాద్రిపై ఈ నెల 25 నుంచి మొదలుకుని ఆగస్టు 23 వరకూ ‘శ్రావణ’ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రావణమాసం రెండో వారం ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం వేడుకలు జరుగనున్నాయి. ఈ రోజున దుర్గమ్మ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి శ్రావణ శుద్ధ చతుర్ధశి శుక్రవారం ఆగస్టు 10వ తేదీ వరకు మూడురోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులూ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలిపివేస్తారు. 11వ తేదీ నుంచి యథావిధిగా అన్ని ఆర్జిత సేవలు కొనసాగుతాయి. ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమిని పురస్కరించుకుని దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఆగస్ట్ 23వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది. ఈ వ్రతాలకు సంబంధించిన అప్లికేషన్లను ఆలయ ప్రాంగణంలో రెండు, మూడు రోజుల పాటు భక్తులకు అందజేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లోకేష్-ఆనంద్ మహీంద్రా మధ్య ఆసక్తికర సంభాషణ
నేరస్థులు, హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా?
Read latest AP News And Telugu News