Minister Nara Lokesh: జగన్ హయాంలో విద్యా సంస్కరణలను దెబ్బతీశారు
ABN , Publish Date - May 31 , 2025 | 09:35 PM
జగన్ హయాంలో విద్యారంగం భ్రష్టుపట్టిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. విద్య సంస్కరణలను కూడా దెబ్బతీశారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.

అమరావతి: ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy) ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) హితవు పలికారు. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన జగన్ నుంచి హుందాతనం ఆశించడం తప్పేనని అన్నారు. ఇవాళ(శనివారం) మంత్రి నారా లోకేష్ సచివాలయంలో తన ఛాంబర్ నుంచి మీడియాతో మాట్లాడారు. యూనిఫామ్ దగ్గర నుంచి చిక్కీ వరకూ పార్టీ రంగులు, జగన్ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు గురించి మాట్లాడటం ఆయనకే చెల్లిందని విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్బుక్స్ రద్దు చేసిన మీరు మాట్లాడటమేనా అని ప్రశ్నించారు మంత్రి నారా లోకేష్.
అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు కాపలా పెట్టిన మీరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ117, ఇతర అసంబద్ధ నిర్ణయాలతో వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను సిద్ధం చేయకుండానే వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని జగన్ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. తాను మంత్రి అయిన వెంటనే నిర్వహించిన టెస్ట్లో 90శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. పదోతరగతి ఫెయిల్ అయితే చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చదువు ఆపించి పెళ్లి చేస్తారని చెప్పారు మంత్రి నారా లోకేష్.
వారి భవిష్యత్తు కోసం ఆలోచించే సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని తాము వాయిదా వేశామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చేసిన తర్వాతే సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. జగన్ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్య ప్రణాళిక మారుస్తున్నామని స్పష్టం చేశారు. పదోతరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినప్పుడు రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోరడం ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ అని వివరించారు. ఈ ఏడాది 45,96,527 లక్షల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేశామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్.
రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ తర్వాత మార్కుల్లో వ్యత్యాసం వచ్చిన జవాబు పత్రాల సంఖ్య 11,175 అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 99.75 శాతం ఖచ్చితత్వంతో మూల్యాంకనం జరిగిందని తెలిపారు. మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జగన్ జమానాలో 2022లో 41,694 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. అందులో 8,235 స్క్రిప్టుల (20 శాతం) వ్యత్యాసాలను గుర్తించారని అన్నారు. జగన్ హయాంలో కనీసం ఈ వివరాలను బయట పెట్టే ధైర్యం కూడా చేయలేదని మండిపడ్డారు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి తమపై బురద జల్లడం సిగ్గుచేటని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
Read Latest AP News And Telugu News