Rain Alert On AP: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:29 PM
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వెల్లడించారు. దీనితో పాటుగా నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.
వీటి ప్రభావంతో మంగళవారం(14-10-2025) ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు.
అలాగే, బుధవారం (15-10-25) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News