Ashok Gajapathi Raju: వైసీపీ హయాంలో నారా లోకేష్ ధైర్యంగా పోరాడారు
ABN , Publish Date - May 26 , 2025 | 06:53 PM
సీఎం చంద్రబాబు విజనరీ ఉన్ననేత.. ఆయన పార్టీని ముందుకు నడిపారని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కొనియాడారు. చంద్రబాబుతో పాటు తాము అందరం పార్టీని వైసీపీ నుంచి కాపాడామని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.

అమరావతి: మంత్రి నారా లోకేష్కు (Nara Lokesh) టీడీపీని ముందుకు నడిపించే లక్షణాలు ఉన్నాయని తెలుగుదేశం సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు కావాలనే నారా లోకేష్పై 2019కు ముందు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో లోకేష్ ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. లోకేష్ లీడర్గా నిరూపించుకున్నారని ఉద్ఘాటించారు. తెలుగుదేశంతోనే ఏపీ భవిష్యత్తు ముడిపడి ఉందని అశోక్ గజపతి రాజు వెల్లడించారు.
ఇవాళ(సోమవారం) ఏబీఎన్తో అశోక్ గజపతి రాజు మాట్లాడారు. కాలంతో పాటు మార్పు అనివార్యమని.. మానవ జీవితంతో పాటు టీడీపీలో కూడా మార్పు రావాలని సూచించారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నేత నందమూరి తారకరామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పాటుపడ్డారని అన్నారు. తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ గుర్తింపు తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. చంద్రబాబుతో పాటు తాము అందరం పార్టీని వైసీపీ నుంచి కాపాడామని అన్నారు. చంద్రబాబు విజనరీ ఉన్ననేత.. ఆయన పార్టీని ముందుకు నడిపారని కొనియాడారు అశోక్ గజపతి రాజు.
ఐటీలో చంద్రబాబు చాలా మార్పులు తీసుకువచ్చారని అశోక్ గజపతి రాజు ప్రశంసించారు. యువతకు ఆత్మవిశ్వాసం కల్పించారని అన్నారు. చంద్రబాబు చాలా సంక్షోభాలను కూడా ఎదుర్కొన్నారని.. విలువలను కాపాడుతూ పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యకర్తలు కూడా అనేక త్యాగాలు చేశారని ఉద్ఘాటించారు. జగన్ పాలనలో వైసీపీ నేతలకు ఎదురు నిలబడి కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారని, వారి విలువైన సమయం టీడీపీ కోసం కేటాయించారని కొనియాడారు. విలువలు, ధర్మాన్ని కూడా కాపాడుకుంటూ కార్యకర్తలను కలుపుకొని వెళ్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు అశోక్ గజపతి రాజు.
యువత, మహిళలు పార్టీలోకి ఎక్కువగా రావాలని... అందుకు అందరం కృషిచేయాలని అశోక్ గజపతి రాజు పిలుపునిచ్చారు. అప్పుడే పార్టీలో నూతనోత్తేజం వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా ఆలోచించుకోవాలని.. దేవుడు మనకు ఆలోచనాశక్తి ఇచ్చారని తెలిపారు. అందరు తమ శక్తిని ఉపయోగించి ధర్మం, విలువలు పాటించే టీడీపీకి అండగా నిలవాలని కోరారు. ధర్మం, విలువలు, కాపాడటంతోనే పార్టీ 43 సంవత్సరాలు నిలబడగలిగిందని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్కు వల్లభనేని వంశీ
సర్పంచ్ వేధింపులు.. ప్రాణహానీ అంటూ మహిళ ఫిర్యాదు
Read Latest AP News And Telugu News