Amaravati Farmers: జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి మీడియాపై పోలీసులకు అమరావతి రైతుల ఫిర్యాదు
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:55 AM
రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని రాజధాని అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఛానల్లో కృష్ణంరాజు అనే వ్యక్తి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. అమరావతిపై ఏవరూ కూడా ఇలా వ్యాఖ్యలు చేయరని చెప్పారు.

అమరావతి: రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు (Journalist Krishnam Raju) అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని రాజధాని అమరావతి రైతులు (Amaravati Farmers) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఛానల్లో కృష్ణంరాజు అనే వ్యక్తి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. అమరావతిపై ఏవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. రాజధాని మహిళలు అంటే నాలుగు జిల్లాల వారే ఉన్నారని తెలిపారు. ఈ ఘటనను సాక్షి యాజమాన్యం కనీసం ఖండించలేదని చెప్పారు. సాక్షి మీడియాతో పాటు, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై పోలీసులకి ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో అమరావతి రైతులు మాట్లాడారు.
ఇవాళ(ఆదివారం) మహిళా కమిషన్ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని.. వారిని శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. రాజధాని ప్రాంత మహిళలు 1630 రోజులు ఉద్యమం చేశారని తెలిపారు. మళ్లీ అమరావతిలో పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. సీఎం చంద్రబాబు దేవతల రాజధాని అంటే.. కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఖండించాల్సిన కొమ్మినేని శ్రీనివాసరావు సిగ్గు లేకుండా సెటైర్లు వేశారని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు అమరావతి రైతులు.
మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. మహిళలపై ఇంత నీచంగా మాట్లాడితే చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. తమ భూములు రాజధానికోసం ఇచ్చి అడ్డమైన వాళ్లతో తిట్టించుకుంటున్నామని అన్నారు. ఐదేళ్లుగా అమరావతిని చంపిన వైసీపీ నేతలు ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ను ధీటుగా ఎదుర్కొన్న మహిళల పోరాట పటిమని గుర్తించాలని కోరారు. అక్కసుతోనే ఇప్పుడు ఇలాంటి నీచ వ్యాఖ్యలను సాక్షి మీడియాలో మాట్లాడిస్తున్నారని అమరావతి రైతులు ఫైర్ అయ్యారు.
కొమ్మినేని, కృష్ణంరాజు ఇళ్లల్లో ఆడవాళ్లు ఉంటారనే విషయాన్ని వారు మరచిపోయారా అని నిలదీశారు. తమ మహిళలు చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న లాఠీఛార్జి, కేసులు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అమరావతిపై నీచంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు జగన్కి బుద్ధి చెప్పినా... ఇంకా అలాగే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు ఇంకా కృష్ణంరాజుని అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం, పోలీసులు ఈ విషయంపై స్పందించాలని కోరారు. అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు.
అనంతపురంలో తెలుగు మహిళల ఆందోళన
అనంతపురంలోని సాక్షి కార్యాలయం వద్ద ఇవాళ(ఆదివారం) తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. తెలుగింటి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన సాక్షి ఛానల్ని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతిపై విమర్శలు చేసిన యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజులపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సాక్షి కార్యాలయం వద్ద సాక్షి పేపర్లను నిప్పంటించి తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి తెలుగు మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు ఇచ్చిన తల్లులను కూడా అలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. జగన్కు సిగ్గులేదు.. మహిళల పట్ల ఇంత నీచంగా మాట్లాడిస్తావా అని మండిపడ్డారు తెలుగు మహిళలు.
వైసీపీని 150 సీట్ల నుంచి 11 సీట్లకు దింపినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదంటూ తెలుగు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి కార్యాలయం వద్ద గేట్లు ఎక్కడానికి తెలుగు మహిళలు ప్రయత్నించారు. సాక్షి ఆఫీసులోకి వెళ్లడానికి ప్రయత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు తెలుగు మహిళలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాక్షి ఛానల్, జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ తెలుగు మహిళలు నినాదాలు చేశారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలుగు మహిళలను అరెస్టు చేసి స్టేషన్కి పోలీసులు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు
కన్నప్పలో బ్రాహ్మణులను కించపరిచారు
Read Latest AP News And Telugu News