Bhumana Slams Bandi Sanjay: టీటీడీపై ఇంత బండ వేస్తారా.. బండి సంజయ్పై భూమన ఆగ్రహం
ABN , Publish Date - Jul 12 , 2025 | 02:43 PM
Bhumana Slams Bandi Sanjay: టీటీడీలో 22 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించామని ఆరు నెలల క్రితం టీటీడీ బోర్డు ప్రకటించిందని.. కానీ ఇప్పుడు బండి సంజయ్ మాత్రం వెయ్యి మందికి పైగా ఉన్నారని చెబుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ అన్నారు.

తిరుపతి, జులై 12: టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Former TTD Chairman Bhumana Karunakar Reddy) తప్పుబట్టారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీలో ఉన్న వెయ్యి మంది అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని బండి సంజయ్ హెచ్చరించారని.. పూర్వ అధ్యక్షుడిగా బండి సంజయ్ వ్యాఖ్యలను తాను ఆక్షేపిస్తున్నట్లు తెలిపారు. బండి సంజయ్ కామెంట్స్ శ్రీవారి ఆలయంపై దాడిలా ఉందని మండిపడ్డారు. దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని పోకుండా.. ఇంత పెద్ద బండ టీటీడీపై వేయటం సబబుగా లేదన్నారు.
టీటీడీలో 22 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించామని ఆరు నెలల క్రితం టీటీడీ బోర్డు ప్రకటించిందని.. కానీ ఇప్పుడు బండి సంజయ్ మాత్రం వెయ్యి మందికి పైగా ఉన్నారని చెబుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన వద్ద ఆధారాలు ఉంటే తెలపాలని భూమన సవాల్ చేశారు. దాదాపు 20 శాతం మంది అన్యమత ఉద్యోగులు టీటీడీలో ఉన్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యల సారాంశమని చెప్పుకొచ్చారు.
కూటమి ప్రభుత్వం బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ హెచ్చరిక చేసి 24 గంటలు అయ్యిందని.. ఇప్పటి దాకా టీటీడీ చైర్మన్, ఈఓ, ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కానీ దీన్ని ఖండించలేదన్నారు. వీరంతా బండి సంజయ్కి లొంగిపోయారా? ఆయన చెప్పింది నిజమని సమర్ధిస్తున్నారా అని నిలదీశారు. కేంద్ర మంత్రి ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. పాలక మండలిని, టీటీడీ ఉద్యోగులను తీవ్రంగా అవమానపరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈరోజు రాలేను.. సిట్కు విజయసాయి సమాచారం
ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కు మంత్రి మండపల్లి రాంప్రసాద్ పరామర్శ
Read Latest AP News And Telugu News