TG News: బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:39 AM
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్యానాయక్తో మరికొంతమంది నేతలపై పోలీసులు కేను నమోదు చేశారు.

మహబూబాబాద్: డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత రెడ్యానాయక్పై (BRS Senior Leader Redyanayak) పోలీసులు ఇవాళ(మంగళవారం) కేసు నమోదు చేశారు. రెడ్యానాయక్తో సహా 17 మందిపై కేసులు పెట్టారు. నిన్న(సోమవారం) డోర్నకల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలోనే పోలీసులు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో డోర్నకల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా సోమవారం నాడు డోర్నకల్ పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ర్యాలీ నిర్వహించారు. దీంతో డోర్నకల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రెండు పార్టీల్లోని నేతలనూ నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణతో డోర్నకల్ నియోజకవర్గం మళ్లీ హాట్ టాపిక్గా మారింది.
పోలీసుల సూచనలు అతిక్రమించడంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని డోర్నకల్ పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం మరికొంతమందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. పోలీసు కేసులతో డోర్నకల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత అందరి సంగతి తెలుస్తానని రెడ్యానాయక్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. రాజకీయ కక్షల్లో భాగంగానే తమ పార్టీ నేతలపై పోలీసులు కేసు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తమ నేతలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. అయితే ఇలాంటి పరిణామాలు ఇంకా కొనసాగితే డోర్నకల్ రాజకీయాలు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే
రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి
Read Latest Telangana News and National News