Minister Thummala: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:33 PM
రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు.

ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Elections) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. రేగులచలక, కోయచెలక గ్రామాల్లో సీసీ రోడ్లు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
అనంతరం రఘునాథపాలెం మండలం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేసిన దమ్మున్న నాయకుడు రేవంత్రెడ్డి అని అభివర్ణించారు. దేశమంతా పాదయాత్ర చేసి కులగణనకు ఆలోచన చేసిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ చేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఉద్ఘాటించారు. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాలనలో దేశమంతా రూ. 70 వేల కోట్లు రుణమాఫీ చేస్తే.. తెలంగాణలో రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేయాలని కోరారు. ఇతర జిల్లాల వారు ఖమ్మంలో నివసించాలనే ఆలోచనలు వచ్చేలా ఖమ్మం నగరాభివృద్ధి జరుగుతోందని తెలిపారు. అధికార పార్టీ వారు సర్పంచ్లు.. ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా ఎన్నికైతే ప్రజలకు చేరువ కావొచ్చని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని చెప్పారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తామని అన్నారు. ప్రజాభిమానం ఉంటే పదవులు అవే దక్కుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
త్వరలో కాళేశ్వరంపై సర్కారుకు నివేదిక
గుట్ట ప్రధాన కూడళ్లలో దేవుళ్ల విగ్రహాలు
Read latest Telangana News And Telugu News