Share News

AICC: ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షితో కార్పొరేషన్ చైర్మన్ల కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

ABN , Publish Date - Jun 01 , 2025 | 09:10 PM

ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల సమావేశం ఆదివారం నాడు గాంధీభవన్‌లో జరిగింది. ఇన్‌చార్జ్ మీనాక్షికి కార్పొరేషన్ చైర్మన్లు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను కలుపుకుపోవడం లేదని ఫిర్యాదు చేశారు.

AICC: ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షితో కార్పొరేషన్ చైర్మన్ల కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
AICC incharge Meenakshi Natarajan

హైదరాబాద్: ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో (AICC incharge Meenakshi Natarajan) ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల సమావేశం ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో జరిగింది. ఇన్‌చార్జ్ మీనాక్షికి కార్పొరేషన్ చైర్మన్లు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను కలుపుకుపోవడం లేదని ఫిర్యాదు చేశారు. రివ్యూల పేరుతో డిపార్ట్‌మెంట్ ఎండీలతో మాట్లాడుతున్నారే తప్పా కార్పొరేషన్ తమను సంప్రదించడం లేదని కార్పొరేషన్ చైర్మన్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున టీటీడీ లెటర్స్‌లో కూడా కార్పొరేషన్ చైర్మన్లకు ప్రోటోకాల్ వచ్చేలా చూడాలని విన్నవించారు.


కాంగ్రెస్ బలోపేతంపై చర్చించాం: రియాజ్

కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఈ సమావేశం జరిగిందని గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారనే విషయంపై మీనాక్షి నటరాజన్‌ ఆరా తీశారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎలా ముందుకెళ్లాలనే విషయంపై కార్పొరేషన్ చైర్మన్లను మీనాక్షి నటరాజన్‌ అడిగారని అన్నారు. కార్పొరేషన్ ద్వారా ప్రజల్లోకి పథకాలను ఏ విధంగా తీసుకెళ్తున్నారని అడిగారని చెప్పారు. తాము ప్రజల్లోకి పార్టీని, పథకాలను ఎలా తీసుకెళ్తున్నామనే విషయాన్ని వివరించామని తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం తాము సూచనలు చేశామని అన్నారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలని కార్పొరేషన్ చైర్మన్లు కోరారని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మీనాక్షి నటరాజన్‌ నోట్ చేసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సమానంగా తమకు ప్రోటోకాల్ ఇవ్వాలని కోరామని.. ఈ విషయాన్ని మీనాక్షి నటరాజన్‌ దృష్టికి తీసుకెళ్లామని గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తెలిపారు.


ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గౌరవం: మెట్టు సాయి

కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై కార్పొరేషన్ చైర్మన్లతో మీనాక్షి నటరాజన్‌ చర్చించారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తెలిపారు. పలు సమస్యల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారని అన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్‌ని బలోపేతం చేసిన, జెండాను మోసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గౌరవం ఉంటుందని మీనాక్షి నటరాజన్‌ హామీ ఇచ్చారని చెప్పారు. స్థానిక సంస్థల్లో కష్టపడ్డ వారికి అవకాశం ఇస్తామని తమతో మీనాక్షి నటరాజన్‌ అన్నారని మెట్టు సాయి పేర్కొన్నారు.


పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది: ఎంపీ మల్లు రవి

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఎంపీ మల్లు రవి బాధ్యతలు స్వీకరించారు. గాంధీ భవన్‌లో చిన్నారెడ్డి నుంచి మల్లు రవి బాధ్యతలు తీసుకున్నారు. భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మల్లు రవికి స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ సంబురాలు చేశారు. పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, కానీ లక్ష్మణ రేఖ దాటవద్దని క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ వల్ల మూడుసార్లు ఎంపీ అయ్యానని, ఒకసారి ఎమ్మెల్యే, రెండు సార్లు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిని అయ్యానని గుర్తుచేశారు. పార్టీలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నియమించడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. నాలుగు గోడల మధ్య నేతలు అభిప్రాయాలను తెలపాలని సూచించారు. ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని, క్రమశిక్షణ గీత దాటొద్దని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వేములవాడలో కొనసాగుతోన్న కోడెల మృత్యు ఘోష.. స్పందించిన కలెక్టర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

For Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 09:16 PM