Share News

TG High Court: తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు?

ABN , Publish Date - May 02 , 2025 | 04:52 AM

గ్రూప్-1 పరీక్షలో మార్కుల కేటాయింపు, హాల్ టికెట్ నంబర్లు మార్చడంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అభ్యర్థుల గందరగోళం, సెంటర్ కేటాయింపులో తప్పులపై టీజీపీఎస్సీపై విమర్శలు ఉన్నాయి.

TG High Court: తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు?

  • గ్రూప్‌-1 పరీక్షపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు

  • ఆయా సబ్జెక్టు నిపుణులే మూల్యాంకనం చేసి, కేటాయించారన్న టీజీపీఎస్సీ

  • ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో హాల్‌ టికెట్‌ నంబర్లు మారతాయని నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు

  • మెయిన్స్‌లో నంబర్లు మారడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు

  • పిటిషనర్ల న్యాయవాదులు

  • విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న పిటిషన్లపై హైకోర్టులో గురువారం కూడా విచారణ కొనసాగింది. జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష హాల్‌ టికెట్‌ నంబర్లు, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో హాల్‌టికెట్‌ నంబర్లు వేర్వేరుగా ఉంటాయన్న విషయాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొనలేదని గుర్తుచేశారు. మెయిన్స్‌లో హాల్‌టికెట్‌ నంబర్లు మారడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారని తెలిపారు. అలాగే మెయిన్స్‌ రాసిన అభ్యర్థుల సంఖ్యను కూడా ఒక్కోసారి ఒక్కోరకంగా ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సెంటర్ల కేటాయింపుల్లోనూ తప్పులు జరిగాయని, కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. మళ్లీ మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని కోరారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పిందే చెప్పి, కోర్టు సమయం వృథా చేస్తున్నారన్నారు. పిటిషనర్లు అపోహ పడుతున్నారని, నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగిందని తెలిపారు.


తెలుగులో పరీక్ష రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారని ధర్మాసనం ప్రశ్నించగా.. ఆయా సబ్జెక్టుల నిపుణులే మూల్యాంకనం చేసి, మార్కులు కేటాయించారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, బుధవారం జరిగిన విచారణలో జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు స్పందిస్తూ.. తమిళనాడులో ప్రజలకు అన్ని భాషలూ వచ్చినా, మాతృభాష అయిన తమిళంలోనే మాట్లాడతారని చెప్పారు. మన దగ్గర మాత్రం ఆంగ్లంలో మాట్లాడిన వారికే ఎక్కువ మర్యాద ఇస్తారన్నారు. ఇది తన స్వీయ అనుభవం కూడా అని తెలిపారు.


For Telangana News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:53 AM